హైదరాబాద్, 15 ఆగస్టు 2013: ఏ ప్రాంత ప్రజలకూ అన్యాయం జరగకుండా చూడాలన్నదే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ అభిమతం అని ఎపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు. న్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని ఆమె కోరుతున్నారని చెప్పారు. శ్రీమతి విజయమ్మను లోటస్పాండ్లోని ఆమె నివాసంలో గురువారం ఎపి ఎన్జీవో సంఘం ప్రతినిధులు కలిసి నిరవధిక సమ్మెకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అశోక్బాబు మీడియాతో మాట్లాడారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని అన్ని పార్టీలనూ తాము కోరుతున్నామని ఆ క్రమంలోనే శ్రీమతి విజయమ్మను కలుసుకున్నామన్నారు. అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రవీణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష, నిరంకుశ వైఖరికి నిరసనగా శ్రీమతి విజయమ్మ ఈ నెల 19 నుంచి చేయనున్న నిరవధిక నిరాహార దీక్షకు ఎపి ఎన్జీవోలు మద్దతు పలికారని చెప్పారు.