హైదరాబాద్, 18 సెప్టెంబర్ 2012: వేసిన పంటలకు నీటి సదుపాయం లేక కర్నూలు, వైయస్ఆర్ కడప జిల్లాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే నీటిని విడుదల చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసినట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి తెలిపారు. అయితే, ముఖ్యమంత్రి నుంచి తమకు ఇంతవరకూ స్పష్టమైన హామీ రాలేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పంటలకు నీరు ఇస్తుందన్న నమ్మకంతో రైతులు నారుమళ్ళు వేసుకొన్నారని, అయితే, వారి నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. పంటలకు నీటి సరఫరా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు.
శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ, రైతుల ఇబ్బందులపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేశారని, ఈ విషయమై కలెక్టర్కు మెమొరాండం సమర్పించారన్నారు. కర్నూలు, వైయస్ఆర్ కడప జిల్లాల పంటలకు నీటి సరఫరా చేయాలని తాము ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు. నీళ్ళిస్తామని గాని, ఇవ్వలేమని కాని తమకు సిఎం స్పష్టంగా చెప్పలేదన్నారు. ప్రభుత్వం తీరు కారణంగా రైతులు రోడ్డున పడే దుస్థితి నెలకొందని శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయిందని శ్రీకాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సంక్షోభంపై అసెంబ్లీలో చర్చ సమయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టిడిపి కుట్రపూరితంగా గందరగోళం సృష్టించాయని ఆరోపించారు. ఏదో చిన్న సమస్యను తీసుకొని పెద్దదిగా చేసి సభలో అల్లరి చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతాంగానికి గంట సేపు కూడా విద్యుత్ సరఫరా చేసే పరిస్థితి కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సమస్యపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని శ్రీకాంత్రెడ్డి దుయ్యబట్టారు. రైతు సమస్యలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడంలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై ప్రజాసమస్యలపై
అసెంబ్లీలో చర్చ జరగకుండా చేస్తున్నాయని శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవటం వల్లే రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం నెలకొందని ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, శ్రీకాంత్రెడ్డి విమర్శించారు.