ధనవంతులను వదిలి పేదల ఇళ్లపై ప్రతాపమా

1 Dec, 2015 17:27 IST
నెల్లూరుః వర్షాలకు అతలాకుతలమైన నెల్లూరు జిల్లా ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మండిపడ్డారు. కుండపోత వర్షాలతో ప్రజలు సర్వం కోల్పోయారని తక్షణమే ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాన్ వచ్చిన వెంటనే తమిళనాడుకు 939 కోట్లు సాయం ప్రకటించిన ప్రధాని...ఏపీ విషయంలో మాత్రం మొండిచేయి చూపుతున్నారని అన్నారు. చంద్రబాబు నిధులు రాబట్టుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.  

కాలువ మీద ఇళ్లు కట్టుకున్న పేదలపై ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదని అనిల్ కుమార్ అన్నారు. అత్యాశతో కాలువ మీద ఇళ్లు కట్టుకున్నందునే నగంరలోకి నీరు వచ్చిందనడం దారుణమన్నారు. ధనవంతులను వదిలి దశాబ్దాలుగా నివాసముంటున్న పేదల ఇళ్లు కూల్చితే చూస్తూ ఊరుకోబోమన్నారు. మంత్రి నారాయణకు సంబంధించిన కాలేజ్ లో కాలువ లేదా అని ప్రశ్నించారు. వరద బాధితులకు ఇప్పటివరకు ఒక్క పైసా సాయం అందలేదని, వెంటనే వారిని ఆదుకోవాలన్నారు.