అనంతపురం: జిల్లాలో కరువు నివారణకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఎంతో శ్రమించారని, ఆయన హయాంలో అనంతపురం జిల్లా అభివృద్ధి చెందిందని, మళ్లీ జిల్లాకు మంచి రోజులు రావాలంటే వైయస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని వైయస్ర్ సీపీ నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. వైయస్ఆర్ హయాంలో జిల్లాలో ఎంతో అభివృద్ధి జరిగిందని, రైతులు ఎంతో ధీమాగా ఉండేవారని గుర్తు చేశారు. హంద్రీ-నీవా ప్రాజెక్ట్ పనులను యుద్ధ ప్రాతిపదికన మహానేత పూర్తి చేయగా, చంద్రబాబు ప్రభుత్వం వైయస్ఆర్ ఆశయాలకు తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు. జిల్లాలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, కేవలం 45 మందికే చంద్రబాబు సర్కార్ పరిహారం ఇవ్వడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అనంతను విస్మరించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎం అయ్యాక రైతుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తున్నా రైతులకు ఎలాంటి ప్రోత్సాహకాలు లేవని విమర్శించారు. ఎన్నికలకు ముందు రుణమాఫీ అన్నారు. ఆ హామీకి నీళ్లొదిలారు. కనీసం రైతుల వడ్డీలకు కూడా సరిపోవడం లేదని ఫైర్ అయ్యారు. 4 లక్షల మంది వ్యవసాయ కూలీలు జిల్లా నుంచి వలస వెళ్లినా చంద్రబాబు సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ప్రతి ఒక్కరికి భరోసా కల్పించేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని తెలిపారు.