కిరణ్, లగడపాటి నకిలీ సమైక్యవాదులు

13 Dec, 2013 20:34 IST
హైదరాబాద్ : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోటరీలోని ముఖ్యుల సూచనల మేరకు సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ డ్రామా ఆడుతున్నారని, వీరిద్దరూ నకిలీ సమైక్యవాదులని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.  పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన విషయంలో వీరిద్దరూ సోనియా గాంధీని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినా అధిష్టానం వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అందరికీ తెలుసని విమర్శించారు.

రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తూ సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన నాటి నుంచీ కిరణ్‌ పదవిని అంటిపెట్టుకుని ఫైళ్లపై సంతకాలు చేస్తూంటే ఆయన సోదరుడు వసూళ్లు చేసుకుంటున్నారని అంబటి దుయ్యబట్టారు. ‘విభజన నిర్ణయం వెలువడినప్పుడే కిరణ్‌ సీఎం పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇంత దాకా వచ్చేదా? అసెంబ్లీని సమావేశపరచి సమైక్య తీర్మానం చేద్దామని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్నోసార్లు డిమాండ్‌ చేసింది. బీఏసీలో కూడా విజ్ఞప్తి చేశాం. కానీ కిరణ్‌ అందుకు అంగీకరించలేదు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే చిత్తశుద్ధే ఆయనకు ఉంటే ఇలా చేసేవారా?’ అని అంబటి ప్రశ్నించారు.

‘రూ.1,717కోట్ల విలువగల ‘ల్యాంకో ఇన్‌ఫ్రా’ కంపెనీ దీర్ఘకాలంగా బకాయి పడిన రూ.8,000 కోట్ల రుణాన్ని రీ షెడ్యూల్ (వాయిదా) చేయడమే కాక తాజాగా రూ.3,500 కోట్ల రుణాన్ని ఇస్తున్నారు. లగడపాటి నిజంగా కాంగ్రెస్‌పై, కేంద్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన వ్యక్తే అయితే జాతీయ బ్యాంకులు ఆయన కంపెనీకి ఇలా లబ్ధిని చేకూరుస్తాయా?’ అని అంబటి విస్మయం వ్యక్తం చేశారు. తాము ఎన్జీవో నేతలతో కలిసి పెట్టబోయే పార్టీ ద్వారా రాజకీయ లబ్ధి పొంది, వచ్చే ఎన్నికల్లో సీట్లు గెలిచి ఆ తరువాత వాటిని సోనియా కాళ్ల ముందు పెట్టాలనేది కిరణ్, లగడపాటి ఆలోచన అని చెప్పారు.

కానీ తెలుగు ప్రజలు వీరిద్దరి నాటకాలనూ గమనిస్తున్నారని, వారు పెట్టబోయే పార్టీకి ఒక్క ఓటు గానీ, ఒక్క సీటుగానీ రావని అంబటి జోస్యం చెప్పారు. సోనియాతో శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి కుమ్మక్కయి ఉంటే 16 నెలలు జైలులో ఎందుకు ఉంటారు? కాంగ్రెస్‌ పెట్టించిన కేసులతో ఎందుకు వేధింపులకు గురవుతారు? ఆయన సంస్థలపై దాడులు ఎందుకు జరుగుతాయి? అని అంబటి ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్నలు వేశారు.