హైదరాబాద్, 12 నవంబర్ 2013: ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం కేవలం కంటి తుడుపు చర్య మాత్రమే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనపై ఏర్పాటు చేసిన జీఓఎంతో భేటీకి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మైసూరారెడ్డి, గట్టు రామచంద్రరావు మంగళవారం ఢిల్లీ బయల్దేరి వెళ్ళారు. ఈ సందర్భంగా మైసూరారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అంశం కాంగ్రెస్ సొంతింటి వ్యవహారంలా భావిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచాలని జీఓఎంలో స్పష్టంగా చెబుమని మైసూరారెడ్డి తెలిపారు. సోనియా ఆదేశాలు అమలు చేయడమే జీఓఎం అజెండా అని ఆయన అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎంతమంది వెళ్లినా ఎక్కడకి వెళ్లినా సమైక్యమే పార్టీ నినాదమని మైసూరారెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రం విషయంలో కేంద్ర వ్యవహరిస్తున్న తీరు సమాఖ్య వ్యవస్థకు తీవ్ర విఘాతం కలిగించేదిలా ఉందని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో రెండు రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసిన తర్వాత, రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్సార్సీ) సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినట్లు వివరించారు. యూపీఏ ప్రజాస్వామ్య ప్రభుత్వమైతే, ఫెడరలిజంపై నమ్మకం ఉంటే రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయాన్ని కొంచెమైనా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఏ విధంగానూ విభజన సాధ్యం కాకపోయినా కేంద్రం మొండిగా వ్యవహరించడం తగదన్నారు.