'ఆనం'ను జనం అసహ్యించుకుంటున్నారు

14 Apr, 2013 10:09 IST
ఒంగోలు : మహానేత డాక్టర్‌ రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను విన్న ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైయస్‌ఆర్ సీఎల్పీ వి‌ప్ బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఒంగోలులో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.‌ శ్రీ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని మొదట డిమాండ్ చేసిన వారిలో ఆనం రామనారాయణరెడ్డి ఉన్నారని‌ ఆయన గుర్తుచేశారు. మంత్రి కాక ముందు ఆనం ఆస్తులెంతో.. ఇప్పటి ఆస్తులెంతో నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు.

‌నెల్లూరులో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి పర్యటన రచ్చరచ్చగా మారిందని, దీంతో తన పదవి ఊడిపోతుందన్న భయంతో ఆనం ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఆనాటి రచ్చను సోనియాగాంధీ సీరియస్‌గా తీసుకుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి పదవి పోవడం ఖాయమని, ఒకవేళ అదే జరిగితే సిఎం పదవిని దక్కించుకోవాలనే ఆశతోనే సోనియా వద్ద మార్కులు కొట్టేయాలనే దురుద్దేశంతో మహానేత వైయస్ కుటుంబంపై‌ ఆనం రామనారాయణరెడ్డి ఆరోపణలు చేశారని బాలినేని దుయ్యబట్టారు.