అమరావతి: రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఈ నెల 17 నుంచి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రావాలి జగన్, కావాలి జగన్ కార్యక్రమం చేపడుతున్నట్లు పార్టీ సీనియర్ నాయకులు, తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, ప్రతి గ్రామంలో బూత్ కమిటీ, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు గత నాలుగేళ్ల కాలంలో టీడీపీ అవినీతి పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటిని ఏ విధంగా పరిష్కరిస్తామో తెలియజేస్తామని చెప్పారు. వైయస్ఆర్సీపీ నవరత్నాలు పథకాలతో ఎలా భరోసా కల్పిస్తామో వివరిస్తామని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో లంచాలు వసూలు చేసుకునేందుకు ప్రతి సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారని, ప్రచారం కోసమే ఇటీవల గ్యాలరీ వాక్ చేస్తున్నారని విమర్శించారు. కాపులకు వైయస్ఆర్సీపీ ఎప్పుడో మద్దతు తెలిపిందని, అధికారంలోకి వస్తే కాపులకు రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పారు.