మహానేత వైయస్ కు అమెరికాలో శ్రద్ధాంజలి

18 Sep, 2012 01:12 IST

వాషింగ్టన్‌ (డీసీ): మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతి సందర్భంగా శనివారం‌ (సెప్టెంబర్‌ 15) అమెరికాలోని వాషింగ్టన్(డీసీ), వర్జీనియా, మేరీల్యాండ్ ప్రాంత అభిమానులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. వర్జీనియాలోని ఫ్రయింగ్ పాన్ఫారం పా‌ర్క్ ఆడిటోరియంలో వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ సీజీసీ సభ్యులు భూమా నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన సమావేశంలో సీఎంగా వై‌యస్ చేసిన సేవలను అభిమానులు గుర్తుచేసుకున్నారు. మాజీ ఎంపీ జ్ఞానేంద్ర రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, ఏవీ ప్రసా‌ద్, రమే‌ష్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వై‌యస్‌కు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ‘వైయస్‌ఆర్ ఒక చరిత్ర’ వీడియోను ప్రదర్శించారు. తెలుగుజాతి ఉన్నంత కాలం మహానేత కీర్తి చిరస్థాయిగా నిలుస్తుందని భూమా నాగిరెడ్డి అన్నారు. దివంగత వై‌యస్ఆ‌ర్, యువనేత జగ‌న్మోహన్ రెడ్డిల మీద పాడిన గేయాలు, చదివిన కవితలు ‌ఆహూతులను అలరించాయి. కార్యక్రమంలో వల్లూరి రమేష్‌రెడ్డి, రఘు కడసాని, నినాద్‌ అన్నవరం, రాజీవ్ రాజోలు, అమర్ ‌కటికరెడ్డి, శ్రీనివాస్‌ అనుగు తదితరులు పాల్గొన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం కన్వీనర్‌ మేడపాటి వెంకట్‌ తెలిపారు.