మంచి సూచనలు ఇవ్వండి.. సీఎం వైయస్ జగన్ స్వీకరిస్తారు
విశాఖ: ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరును వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పథకాల్లో ఏవైనా తప్పిదాలు దొర్లితే ఎత్తి చూపాల్సిన ప్రతిపక్షం... అలాంటివేమీ కనిపించకపోవడంతో గుళ్లు, విగ్రహాల ధ్వంసాలకు తెగబడుతోందని ఆయన ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. కొట్లాటలు పెట్టడం మాని, మంచి పనుల కోసం సూచనలు ఇస్తే... ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా స్వీకరిస్తారని చెప్పారు. కుట్రలకు పాల్పడిన వారెవరూ తప్పించుకోలేరని అన్నారు. చట్టం ఎవరినీ వదిలిపెట్టదని విజయసాయిరెడ్డి హెచ్చరించారు.
రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ముఖ్యమంత్రి సీఐడీ విచారణకు ఆదేశించారని చెప్పారు. అంతకు ముందు అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. ఇదే సమయంలో కొత్త రథాన్ని ప్రభుత్వం తయారు చేయించిందని చెప్పారు. మత, కులతత్వ రాజకీయాలకు పాల్పడుతున్న చంద్రబాబు ఏ రోజైనా తాను కూలగొట్టిన ఆలయాన్ని మళ్లీ నిర్మించారా? లేదా విచారణకు ఆదేశించారా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.