అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ
4 Mar, 2020 12:59 IST
విజయవాడ: అందరికీ సొంతిల్లు ఉండాలనేది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యం అని, ఉగాది నాడు 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం వైయస్ జగన్ చరిత్ర సృష్టించనున్నారన్నారు. విజయవాడ నగరంలో 50 వేల మంది ఇళ్లు లేనివారిని గుర్తించామన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్లో రూ. 91 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు మంత్రి వెల్లంపల్లి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వందలాది కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు.