నెల్లూరు: వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వరుసగా రెండోసారి సోమశిల జలాశయం పూర్తిగా నిండిందని, మంచి నాయకుడి పాలనకు ఇదే నిదర్శనమని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. జగనన్న పాలనలో వర్షాలు బాగా కురుస్తున్నాయని, నెల్లూరులో పెన్నా బ్యారేజీ నిర్మాణాన్ని త్వరలో పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు. నెల్లూరు నగరంలోని పెన్నానది పరివాహక ప్రాంతాల్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమశిల నుంచి నీటి విడుదల మరింత పెరుగుతుంది. నదీ తీరంలో నివాసం ఉన్న వారు వెంటనే సహాయక శిబిరాలకు వెళ్లాలి. సోమశిల నుంచి నీటి విడుదల పెరిగే అవకాశం ఉండటంతో ఈ ప్రాంతం అంతా మునిగిపోయే అవకాశం ఉంది. తీరంలో నివాసం ఉన్న ప్రజలకు పునరావసం కల్పిస్తాం. త్వరలోనే వీరికి స్థలాలు ఇచ్చి సొంత ఇళ్లు కట్టిస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.