తాడేపల్లి: కరోనాపై పోరాటంలో అందరి భాగస్వామ్యం కావాలని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్రెడ్డి కోరారు. విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ దాతృత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న నర్సులు కోసం 10 వేల సర్జికల్, 2,500 ఎన్-95 మాస్కుల్ని టీఎన్ఏఐ ఏపీ ప్రతినిధులు అందించారు. శుక్రవారం ట్రైన్డ్ నర్సెస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (టీఎన్ఏఐ) ఏపీ బ్రాంచ్ ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ డాక్టర్ జవహర్రెడ్డిని కలిసి మాస్క్లను అందజేశారు. ఈ సందర్భంగా వారిని జవహర్రెడ్డి అభినందించారు. టీఎన్ఎఐ ప్రతినిధుల సామాజిక బాధ్యతను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.