మద్యపాన నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం

7 Feb, 2020 14:44 IST


సచివాలయం: దశలవారి మద్యపాన నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మద్యపాన ఆదాయవనరు కాకూడదని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారన్నారు. సచివాలయంలో మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు పుట్టుకొచ్చాయని, టీడీపీ నేతలే బెల్ట్‌షాపుల ద్వారా మద్యం విక్రయించారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపామని, మద్యం దుకాణాలను కూడా 20 శాతం తగ్గించి దుకాణాలను కూడా ప్రభుత్వమే నడుపుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్‌ శాఖ దాడులు నిర్వహించిందని, గంజాయి, నాటుసారా తయారీదారులపై కేసులు నమోదు చేశామన్నారు. నిరుపేద కుటుంబాలు బాగుపడాలని, పేదవాడి నుంచి మద్యాన్ని దూరం చేయాలనే ఆలోచనతో సీఎం వైయస్‌ జగన్‌ దశలవారీగా మద్యనిషేధ పథకాన్ని తీసుకువచ్చారు. నవరత్నాలు ప్రతి లబ్ధిదారుడికి అందజేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.