పోలవరం జిల్లాలో వైయస్ఆర్సీపీ నేతలపై దాడి
పోలవరం జిల్లా: కూటమి పాలనలో దౌర్జన్య రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తులతో వరుస దాడులు చేయిస్తున్నారని వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా పోలవరం జిల్లాలోని లబ్బర్తి రోడ్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి దాట్ల వెంకటేశ్వరరాజుపై గుర్తుతెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ దాడి జరగగా, ఆయన తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన వెనుక రాజకీయ ప్రేరణ ఉందని వైయస్ఆర్సీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వైయస్ఆర్ సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష గొంతు నొక్కేందుకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా స్పందించారు. వైయస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని, దాడికి పాల్పడిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులకు భయభ్రాంతులు సృష్టించే ప్రయత్నాలను వైయస్ఆర్సీపీ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే వారిని అణచివేయాలన్న ప్రభుత్వ కుట్రలు సాగినా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని నేతలు స్పష్టం చేస్తున్నారు.