అనంతపురం: అద్దె బస్సులోకు కండక్టర్లు లేకుండా ప్రైవేటు డ్రైవర్లకే టిమ్స్ ఇవ్వడం వల్ల ఆర్టీసీ ఆదాయం కోల్పోతోంది. తద్వారా సంస్థ నష్టాల్లో కూరుకుపోతోంది. పల్లెల సర్వీసులను సైతం దశల వారీగా రద్దు చేసేస్తున్నారు. దీని వల్ల ప్రైవేటు వాహనాలకు ఊతమిచ్చినట్లు అవుతోంది. ప్రమాదాలు ఎక్కువై, ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేకుండాపోతోంది. మీరైనా స్పందించి ఆర్టీసీని బతికించండి’ అంటూ వైయస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నాయకులు వైయస్ జగన్ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వడ్డుపల్లిలో ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి, రీజనల్ సెక్రటరీ వి.వి.ఆర్ రెడ్డి, నాయకులు ప్రకాశ్రావు, ప్రభాకర్, మూర్తి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి తదితరులు జగన్ను కలిశారు.