అనంతపురం : సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రజలను కోరారు. అనంతపురం నగరంలోని 7వ డివిజన్ లో వైయస్ఆర్ సీపీ రీజనల్ డిప్యూటీ కోఆర్డినేటర్ రాగే పరుశురాం, స్థానిక కార్పొరేటర్ బండి నాగమణి, మేయర్ వసీం, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కోగటం విజయభాస్కర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ సీపీ శ్రేణులతో కలిసి లతో కలిసి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ‘ఇంటింటికీ వైయస్ఆర్ సీపీ’ నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి రూపొందించిన కరపత్రాలను ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చాక అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అందించామని చెప్పారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాల మీద సంక్షేమ పథకాలు అందేవని, కానీ నేడు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించామన్నారు. ఐదేళ్లలో అనంతపురం నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనించిందని, ఏకంగా రూ.1045 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ అభివృద్ధి మరింతగా కొనసాగాలంటే రానున్న ఎన్నికల్లో ‘ఫ్యాన్’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వైయస్ జగన్ సీఎంగా ఉంటేనే పేదలకు మంచి జరుగుతుందని చెప్పారు.