సస్పెండ్ చేసేస్తామంతే..!

22 Mar, 2016 17:02 IST

ఎన్టీఆర్ ట్రస్ట్  కార్యాలయంలో  చంద్రబాబు నాయుడు కొద్ది మంది సీనియర్ నాయకులతో  పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. పక్కనే యనమలరామకృష్ణుడు కూర్చున్నారు. జూనియర్ ఎమ్మెల్యేలలో చింతమనేని ప్రభాకర్ ఓ  పెద్దపూల దండ తెచ్చియనమల మెడలో వేశాడు. మరో మాల తీసుకొచ్చి చంద్రబాబునాయుడి మెడలో వేశారు. ఇద్దరూ కూడా చాలా ఆనందపరవశులై ఏంటి  చింతమనేనీ ఏంటిది?  ఎందుకింత గౌరవం చేస్తున్నావు? అని తన్మయత్వంగా అడిగారు. దానికి చింతమనేని మరింత భక్తిగా వంగి అయ్యా  అసెంబ్లీలో తమరు మన అపోజిషన్ని భలే ఓడించారు ... నాకైతే బలే సంబరంగా ఉంది అన్నాడు. అపోజిషన్ని ఓడించడవేంటయ్యా అని చంద్రబాబు ఆసక్తిగా అడిగారు.

అదేనండీ. ఇపుడు ఆమజ్జెన రోజాను ఒక్కదెబ్బకి సస్పెండ్ చేసిపారేశారు. అది కూడా ఏడాదిపాటు సస్పెండ్ చేశారు. దాంతో మనల్ని రోజూ తిట్టే రోజాకి తిక్కకుదిరినట్లయింది అన్నాడు చింతమనేని.

అదా.. అది అసెంబ్లీ రూల్స్ ప్రకారమే చేశాం చింతమనే నీ ఇందులో మనగొప్పతనం ఏమీ లేదు అని యనమల చాలా కూల్ గా చెప్పారు. అదేంటిసార్.. ఆరూల్ ప్రకారం ఏడాది పాటు సస్పెండ్ చేయడానికి వీల్లేదని హైకోర్టు కూడా చెప్పింది కదా. రూల్స్ లో లేకపోయిన సస్పెండ్ చేయడమే కదా గొప్ప.  అందుకే మీరంటే నాకు గౌరవం అన్నాడు చింతమనేని. యనమల పొంగి పోయాడు. చంద్రబాబునాయుడు యనమల కేసి ఓరకంట చూసి చిన్నగా నవ్వుకున్నారు.

ఇంతలో మరో ఎమ్మెల్యే కల్పించుకు నిరోజా విషయమే కాదు బాబూ.. తవరు మన అపోజిషన్ పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బలే తిప్పికొట్టేశారు కదండీ బాబూ అన్నాడు. యనమల ఆశ్చర్యం నటిస్తూ అందులో మన గొప్పతనం ఏముందిరా? అన్నారు. ఆ ఎమ్మెల్యే కల్పించుకుని అదేంటండీ బాబూ అలా అంటారు. పెతిపక్షం వాళ్లు రూల్ చెబితేదాన్ని సస్పెండ్ చేసిపారేశారు కదా. మీదెబ్బకి స్పీకర్ గోరే ఆశ్చెర్యపోయారు. అని పొగిడాడు.

ఇంతలో మరో యువ ఎమ్మెల్యే జోక్యం చేసుకుంటూ అది సరేకానీ బాబూ.. మరి ఇపుడు అసెంబ్లీలో అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే లంతా ఈ విషయమై గొడవ చేస్తే ఎలాగ?  అని అడిగాడు.

దానికి యనమల బదులిస్తూ.. దాందే ముందయ్యా.. మొత్తం అపోజిషన్ పార్టీని అయిదేళ్ల పాటు అసెంబ్లీలో అడుగుపెట్టకుండా సస్పెండ్ చేసేస్తా అపుడేంచేస్తారేటి? అని చిలిపిగా అడిగారు.

ఆకుర్ర ఎమ్మెల్యే ఆశ్చర్యపోయాడు. అయితే అసుంటి రూల్స్ కూడా ఉంటాయాబాబూ అని ఆరా తీశాడు. దానికి యనమల స్పందిస్తూ.. రూల్స్ లేకపోతే పెట్టుకుంటాం. ఉన్నరూల్స్ నచ్చకపోతే సస్పెండ్ చేస్తాం. అదికారం మనచేతుల్లో ఉంది అంతా మనిష్టం అని విలాసంగా వివరించాడు.

మరయితే 2019 ఎన్నికలు వస్తే అపోజిషన్ వాళ్లంతా జనంలోకి వెళ్లి మనపై లేనిపోని చాడీలు చెప్తే ఎలాగ? అని అడిగాడు చింతమనేని. దానికి యనమల పగలబడి నవ్వి. అలాంటి అవకాశమే లేకుండా అసలు ఎన్నికలనే సస్పెండ్ చేసేద్దాం అన్నారు.

ఈసారి సీనియర్ అయిన దేవినేని కూడా పక్కలో బాంబు పడ్డట్లు అదిరిపడ్డాడు. ఏంటీ ఎన్నికలను కూడా సస్పెండ్ చేయచ్చాఅని యనమలను అనుమానంగా అడిగాడు.

యనమలతో పాటు చంద్రబాబు కలిసి ఒకేసారి " ఎందుకు చేయకూడదు? మరో 30 ఏళ్లపాటు.. ఏపీకి చంద్రబాబునాయుడే ముఖ్యమంత్రిగా ఉంటారని అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదించేస్తే ఇక ఎవరూ ఏమీ చేయలేరు అన్నారు.

దేవినేని కంగారుపడి. మరి దాని పైకోర్టు కెక్కితే  అని పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తాడు.

చంద్రబాబు కొంచెంచి రాగ్గాచూసి.. అసెంబ్లీ తీర్మానించాక కోర్టులు కూడా ఏమీచేయడానికి వీల్లేదు.చేస్తే ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కోర్టులపై కూడా చర్యలు తీసుకుంటాం? అన్నారు.

మరలా అయితే ఇక ఎప్పటికీ మన పార్టీయే అధికారంలోఉంటుందా? కేంద్ర ప్రభుత్వం ఏమన్నా అడ్డుపడుతుందా? అని అడిగాడు దేవినేని.

యనమలకి కోపం వచ్చింది. అడ్డుపడితే కేంద్రప్రభుత్వాన్ని సస్పెండ్ చేసేద్దాం అన్నాడు.

యనమల..చంద్రబాబునాయళ్లని చూసి..దేవినేనికి ఏదో అనుమానం వచ్చింది. ఎండలు బాగా ముదిరిపోయాయి. వీళ్లేం మాట్లాడుతున్నారో వీళ్లకే అర్దం కావడం లేదు. అని లోపల సణుక్కుంటున్నాడు. దాన్ని గమనించిన యనమల అవసరమైతే ఎండలని కూడా సస్పెండ్ చేసేద్దాం అన్నారు.

దీంతో భయపడి దేవినేని, చింతమనేని ని తీసుకొని తుర్రుమన్నారు. చంద్రబాబు, యనమల మాత్రం తాపీగా ప్రతిపక్షాన్ని అణగదొక్కటం ఎలా అన్న అజెండాతో అరగంట పాటు మీటింగ్ పెట్టుకొని ఇంటి ముఖం పట్టారు.