జనం డబ్బుతో ప్రపంచదేశాలకి

31 Jul, 2015 12:01 IST
మంత్రి వర్గ నిర్ణయాలను చంద్రబాబు విలేకరులకు ఇలా చెప్పుకొంటూ వెళుతున్నారు. **     రాష్ట్రంలో ఎవరు సమ్మె చేసినా అణిచేస్తాం. హక్కుల్ని కాలరాయడంలో మా ప్రభుత్వానికి గతంలో ఎన్నో రికార్డులున్నాయి. బషీర్ బాగ్ లో విద్యుత్ ఉద్య‌మ కారుల్ని కాల్చిన ఘనత మాదే.. అంగ‌న్ వాడీ ఉద్య‌మంలో  ఆడవాళ్ళను గుర్రాలతో తొక్కించిన క్రెడిట్ కూడా మాదే.  
 రాజమండ్రిలో చనిపోయిన వారి ఆత్మశాంతికి మంత్రి వర్గ మౌనం పాటించింది. వాళ్ళను చంపింది ప్రభుత్వమే కాబట్టి, ఆత్మశాంతికి ప్రార్థించాల్సింది కూడా ప్రభుత్వమే చంపేది మేమే, ప్రార్ధించేది మేమే. భగవద్గీతలో ఇదే చెప్పారు. ప్రజల సమస్యల్ని ఎలాగూ నిర్మూలించలేం కాబట్టి, ప్రజల్నే నిర్మూలిస్తే సబబని తీర్మానించాం. మౌనమనేది ప్రభుత్వాలకి వుండాల్సిన గొప్ప సుగుణం, ప్రజలు అరుస్తూవుంటారు. అది వాళ్ళ విధి, వాళ్ళు ఎక్కువగా అరిచినపుడు వాళ్ళ ఆత్మశాంతికి మనం మౌనం పాటిస్తే సరి, తొక్కిసలాటపై న్యాయవిచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. నివేదికలో ఇద్దరు అటెండర్లు, ముగ్గురు స్వీపర్లు కారణమని ఎలాగూ తేలుస్తాం. మీకు తెలిసిన విషయమే.
    సింహాద్రి అప్పన్న భూమిని 99 ఏళ్ళు లీజుకి ఇస్తాం. దేవుడి భూములు  ఎవరికి ఇచ్చినా పరవాలేదు. ఎందుకంటే నోరులేని దేవుడు ధర్నా చేయలేడు కదా. ఒక వేళ చేసినా దేవున్ని కూడా పోలీసులతో తన్నిస్తాం. దేవుడికైనా దెచ్చే గురువు కర్నూలు జిల్లాలో మిసైల్ టెస్టింగ్ సెంటర్ కోసం పేదవాళ్ళు భూముల్ని లాక్కుంటాం. భూములు భూస్వాములకి వుండాలి కానీ పేదవాళ్ళకి వుండడం ఏ రకంగా కూడా న్యాయం కాదు. 
     అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా చేయడానికి ప్రపంచమంతా పర్యటిస్తాం  తొలుత కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్ వెళతాం. ముందుగా మంత్రులు వెళ్ళి అన్ని రకాల రేట్లు మాట్లాడిన తరువాత, నేను వెళ్ళి ఫిక్స్ చేస్తాను. తరువాత మేము చూడాలనుకున్న అన్ని దేశాలకి వెళతాం.విమాన ఖర్చులు వెయ్యికోట్లయినా పరవాలేదు...  రాజధాని నిర్మాణం కోసం నెలజీతం విరాళంగా ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధంగా వున్నారు. వాళ్ళు సిద్ధంగా లేకపోయినా మేము వసూలు చేస్తాం. తెలుగుదేశం ప్రభుత్వానికి వసూళ్ళు కొత్తకాదు.
      అమరావతి అభివృద్ధికి సింగపూర్, జపాన్ ప్రభుత్వాలను ఆహ్వానిస్తాం. షాంఘైమాదిరి అమరావతిని చేస్తాం. షాంఫై మాదిరి చేయడానికి తుర్క్మెనిస్తాన్ వెళ్ళడమెందుకు అని అనుమానం రావచ్చు. మంచి ఎక్కడున్నా గ్ర హిస్తాం. సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ నుంచి రాజధానిని తరలిస్తాం. ఈ మాట ఏడాది నుంచి చెబుతున్నాం. ఇంకో నాలుగేళ్ళు కుడా ఇదే చెబుతాం అని ముగించాడు బాబు
 -రాహుల్