దీక్ష విడిచిన ప్రశ్నలు

30 Jun, 2018 19:03 IST

విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలి నిర్మించి తీరాలి. కేంద్రం మెడలు వంచి కడపకు స్టీలు ఫ్యాక్టరీ వచ్చేలా చేస్తాం ఇదీ చంద్రబాబు మాట. కడప ఎంపీ సిఎం రమేష్ స్టీలు ప్లాంటు రాకపోతే ప్రాణత్యాగం చేస్తా అని ప్రకటించేశాడు. పదిరోజులుగా పచ్చి మంచినీళ్లో, పండు మంచినీళ్లో తాగుతూ కనీసం మిల్లీ గ్రాము బరువు తగ్గకుండా మహోగ్రంగా ఆమరణ నిరాహారదీక్ష నిర్వహించారు. మొక్కవోని, చెక్కుచెదరని, బరువు తగ్గని, బక్కచిక్కని ఆ దీక్షకు బలం చేకూర్చేందుకు రాష్ట్ర నాయకులంతా దీక్షా శిబిరానికి క్యూ కట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు, స్థానిక నాయకులు, సినీ ప్రముఖులు అబ్బో ప్రవాహంలా వచ్చి పవిత్ర భాషణలిచ్చి వెళ్తున్నారు. వారి మాటలే శక్తి గా మారి నిరాహారదీక్ష చేస్తున్న సిఎమ్ రమేష్ నీరసించకుండా కాపాడాయని పచ్చపత్రికలు ఘోషిస్తున్నాయి. కడప ఉక్కు కోసం ఆయన ఉక్కు సంకల్పమే ఆయనలో ఉప్పు తీపి లెవల్స్ ను నియంత్రిస్తోందని వైద్యలుకూడా హాశ్చర్యానందాలతో ప్రకటించారు. ఇలా కనీసం ఏడాదిపాటు నిరవధికంగా ఆమరణ నిరాహారదీక్ష జరిగి, గ్రాము బరువు కూడా తగ్గని నిరాహారనేతగా సిఎమ్ రమేష్ పేరుగిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కుతుందని యావత్ రాష్ట్రం ఆ'నా'శక్తితో ఎదురు చూస్తుండగా ముఖ్యమంత్రి వచ్చి ఆ ఆశపై నిమ్మరసం చల్లేసారు.

ఏం చేసైనా, ఎలాగైనా, ఏదో రకంగా, ఎలాగోలాగా ఉక్కు పరిశ్రమ సాధిద్దాం. నువు రోజూ తాగే నీళ్లలాగే ఈ నిమ్మ నీళ్లు తాగి దీక్ష విరమించు అన్నారు ముఖ్యమంత్రిగారు సిఎమ్ ను. లేదంటే సిఎం రమేష్ ను ఆదర్శంగా తీసుకుని బరువు తగ్గని పరువు తక్కువ దీక్షలు ఎన్ని జరుగుతాయో అని బాబుగారికి భయం పట్టుకుంది. అసలే ప్రతిపక్షాలు సిఎం రమేష్ ఆరోగ్య రహస్యాలకోసం అన్వేషణ ప్రారంభించాయి. మూడు రోజుల తర్వాత జాగ్రత్తపడి హెల్త్ బులిటన్లను, భద్రపరచబట్టిగానీ లేకపోతే అంతా ఉక్కు కల్లోలం అయ్యేదని బాబుకు బాగా తెలుసు.

నిమ్మరసానంతరం బాబుగారి ప్రసంగం మొదలైంది. ఏదోలా కడపకు స్టీలు ఫ్యాక్టరీ అని ప్రకటించారు గనక, అదెలాగో కూడా బాబు గారు సవివరంగా శెలవిచ్చారు. కేంద్రం కడపలోఉక్కు ఫ్యాక్టరీని కట్టి తీరాలి. 50శాతం ఖర్చు మేము భరిస్తాం కనుక కేంద్రం ఖచ్చితంగా స్టీలు ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలి. మిగిలిన 50శాతం ఖర్చు పెట్టి కేంద్రం ఉక్కుఫ్యాక్టరీ కట్టకపోతే మొత్తం ఖర్చు మేమే పెట్టుకుని ఉక్కు ఫ్యాక్టరీ కట్టుకుని తీరతాం. ఎలాగైనా సరే కడపకు స్లీలు ప్లాంట్ వస్తుంది. కనుక సిఎమ్ రమేష్ దీక్ష ఇక చేయవలసిన అవసరం లేదని డిక్లేర్ చేయడమైనది అని ప్రసంగం ముగించాడు బాబు.

అంతా విన్న జనాలకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. నిరాహారదీక్ష చేసింది కేంద్రం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని. నిన్నగాక మొన్న లోకేశం బాబు ప్రస్తావించింది కడప స్టీలు ప్లాంటు ఖర్చు కాదు గదా పావలా రాయితీ కూడా ఇవ్వం అని. నేడు చంద్రబాబు దీక్ష విరమింప చేసింది మొత్తం ఖర్చు పెట్టైనా స్లీలు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని. రాష్ట్ర ప్రభుత్వమే స్లీలు ప్లాంట్ పెట్టగలిగినప్పుడు కేంద్రాన్ని దేబిరించడం ఎందుకు? రోజుకు కోటి రూపాయిలు ఖర్చు చేసి మరీ ఎంపీ దీక్ష చేయడమెందుకు? కేంద్రమే ఉక్కు కర్మాగారానికి మొత్తం ఖర్చు భరించాలి, రాష్ట్రం రాయితీలివ్వదని లోకేశం ఎందుకు చెప్పాలి? ఈ బేతాళ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి చెప్పనివాళ్ల ఓటు గల్లంతౌగాక.