చంద్రబాబుకి జపాన్ భాష వచ్చిందోచ్

25 May, 2016 11:39 IST

 జపాన్ ప్రతినిధులతో సమావేశం.....

 చంద్రబాబు  ఉత్సాహంగా లేచి `` ఈ రాష్ట్రాన్ని ఇప్ప‌టికే సింగ‌పూర్ మ‌లేషియా, థాయ్‌లాండ్ చేసాను. ఇప్పుడు  జపాన్  చేయ‌బోతున్నా `` అన్నాడు 

  జ‌పాన్ ప్ర‌తినిధి `` సుబాసోత‌కిచా`` అన్నాడు

`` జ‌పాన్ త‌రువాత త‌మ‌కిష్ట‌మైంది అమ‌రావ‌తేన‌ని  ఆయ‌న అంటున్నారు. టోక్యోలాగా  అమ‌రావ‌తిని అభివృద్ధి  చేస్తామ‌ని చేబుతున్నారు. అస‌లు టోక్యో నుంచి నేరుగా అమ‌రావ‌తికి బుల్లెట్ రైలు న‌డ‌పాల‌ని యోచిస్తున్నా, ఆ రైలు ఎక్కితే మ‌న‌కు క‌ళ్ళు  క‌న‌ప‌డ‌వు. అంత‌వేగంగా వెళుతుంద‌న్న‌మాట‌, ఇక విమానాలైతే విజ‌య‌వాడ నుంచి గంట‌కు ఒక‌టి టోక్యోకి వెళ‌తాయి. జ‌పాన్ నుంచి ప్ర‌తిదీ ఇచ్చిపుచ్చుకుంటాం.

   మొద‌ట మా మంత్రి నారాయ‌ణ టోక్యో వెళ‌తాడు. జ‌పాన్‌లో నారాయ‌ణ స్కూల్స్ పెట్టె పిల్ల‌ల్ని రోబోలుగా ఎలా మార్చాలో ఆయ‌న నేర్పిస్తాడు. ఆ త‌రువాత జ‌పాన్ నుంచి రోబోల‌ని తెచ్చి నారాయ‌ణ స్కూల్స్లో ఇంట్ర‌డ్యూస్ చేస్తారు. రోబోలకి రోబోలే పాఠాలు చెబుతాయి. విద్యావ్య‌వ‌స్థ‌ని మెరుగుప‌రిచే ఆధునిక విధాన‌మిది.`` అన్నాడు బాబు.

 జ‌పాన్ ప్ర‌తినిధి మ‌ళ్ళీ `` సుబాసోత‌కిచా`` అన్నాడు

`` ఆంధ్ర‌రాష్ట్రాన్ని ఆయ‌న శ‌భాష్ అంటున్నాడు. జ‌పాన్ నుంచి క‌నీసం వంద కంపెనీలు ఇక్క‌డ పెట్టుబ‌డులు పెడ‌తాయ‌ట‌. అమ‌రావ‌తికి జ‌పాన్‌కి సంబంధ‌ముంది. ఒక‌ప్పుడు అమ‌రావ‌తిలో బౌద్ధం ఉంది.ఇప్పుడు జ‌పాన్‌లో బౌద్ధం ఉంది. ఆ అభిమానంతో జ‌పాన్ వాళ్ళు అమ‌రావ‌తిని నిర్మిస్తారు`` అన్నాడు బాబు.`

 `` అమ‌రావ‌తిని ఎన్ని దేశాలు నిర్మిస్తాయి సార్  ?`` ఒక అధికారికి అనుమానం వ‌చ్చి అడిగాడు.

  `` మొత్తం ప్ర‌పంచంలో ఉన్న దేశాలన్నీ అమ‌రావ‌తిని నిర్మిస్తాయి. ఎందుకంటే మ‌న ద‌గ్గ‌ర పైసా లేదు. ప్ర‌జ‌లు ఇచ్చిన విరాళాల‌తోనే రాజ‌ధాని నిర్మాణం జ‌రుగుతుంది. ప్ర‌తి పైసానీ పొదుపుగా వాడాలి.`` 

   ఒక అధికారి వ‌చ్చి `` సార్, ఈ ఫైల్‌లో సంత‌కం చేయండి.`` అని అడిగాడు.

`` ఏమిటిది ``

`` మీరు పెట్టిన ఖ‌ర్చులు ``

 `` దుబారా అంటే నాకు అస‌హ్యం. అందుకే పొదుపుగా ఖ‌ర్చు పెడుతున్నాను``.

 `` అవును సార్ మీరు తిర‌గ‌డానికి బ‌స్సు కోసం ఐదున్న‌ర కోట్లు ఖ‌ర్చు చేశారు. మీరు తిరిగిన విమానాలు, హెలికాప్ట‌ర్ల‌కి ఎంత ఖ‌ర్చైందో లెక్కలు వేస్తే``

 `` అవును నేను లెక్క‌ల్లో వీక్‌. నా ద‌గ్గ‌ర ఉన్న‌ది వేల కోట్లో ల‌క్ష‌ల కోట్లో నాకే తెలీదు`` 

 `` మీ ప్ర‌య‌త్నం కోసం పేద ఉద్యోగులు కూడా ఒక రోజు జీత‌మిచ్చారు. ఆ డ‌బ్బుల్లోంచి జూబ్లీహిల్స్ ఇంటికి రెండుకోట్లు, తాడిప‌ల్లి ఇంటికి ప‌దికోట్లు ఖ‌ర్చుపెట్టారు``

 `` ఇల్లు బాగుంటేనే క‌దా, రాష్ట్రం బావుండేది ``

 `` మ‌దీన‌గూడ‌లోని ఫాంహౌస్‌కి 2 కోట్లు, విజ‌య‌వాడ క్యాంపు కార్యాల‌యానికి ఏకంగా 42 కోట్లు క‌ర్చు చేసారు. ఫ‌ర్నిచ‌ర్‌కే ప‌దికోట్లు, ఎల్ బ్ల‌క్‌, హెచ్ బ్లాక్‌కి 20 కోట్లు ఖ‌ర్చు పెట్టారు. ఇదంతా ప్ర‌జ‌ల డ‌బ్బే``

 `` ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం ఒక‌టే క‌దా``

`` పార్క్ హ‌యాత్ హోట‌ల్‌కి రోజుకి 30వేలు``

`` 30 వేలు చాలా త‌క్కువ . ఎందుకంటే నేను బాగా పొదుపు కాబ‌ట్టి ప్ర‌జ‌లు ఇంకా త్యాగాలు చేస్తే నేను జ‌పాన్ కంపెనీల‌ని ర‌ప్పించి వాళ్లని ఒడ్డుకు చేరుస్తా``

 జ‌పాన్ ప్ర‌తినిధి మ‌ళ్ళీ `` సుబాసోత‌కిచా`` అన్నాడు

`` ఇంత‌కూ వీడేమంటున్నాడు`` అని పిఏని అడిగాడు బాబు

`` మొత్తం ప‌నుల్లో మీకెంత క‌మీష‌న్‌, మాకెంత క‌మీష‌న్ అంటున్నాడు సార్. సుబాసోత‌కిచా అంటే క‌మీష‌న్ అని అర్థం`` అని చెప్పాడు పిఏ

`` జ‌పాన్‌వాడి నోట్లో జ‌డ్ధా పాన్ పెట్టా, ఇదా విష‌యం ఫిఫ్టీ  ఫిఫ్టీ అని చెప్పు`` అన్నాడు బాబు