ఎడా పెడా రెచ్చిపోతోన్న ప్రతిష్ఠ
19 Jun, 2017 11:53 IST
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీని అగ్రగామిని చేస్తానని చంద్రబాబు నాయుడు అన్నప్పుడు అందరూ నవ్వారు. తెలంగాణలో టిడిపికి సినిమా ఏముందని వేళాకోళాలు ఆడారు.
కానీ పట్టువదలని చంద్రబాబు నాయుడు మాత్రం అందరి అంచనాలూ తల్లకిందులు చేస్తూ ఇటు ఏపీలోనూ అటు తెలంగాణలోనూ కూడా తెలుగుదేశం పార్టీ పేరు నిత్యం వార్తల్లో ఉండేలా చేశారు.
తెలంగాణాలో ఇపుడు ఏ ఇద్దరు కలుసుకున్నా టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు. లెక్కకు మించిన భూ కబ్జాలతో...నకిలీ డాక్యుమెంట్లతో ఫోర్జరీ సంతకాలతో దీపక్ రెడ్డి తెలంగాణలో కోట్లకు పడగలెత్తి బుస్సుమని బుస కొట్టారు.
ఆయనకు ముందు టిడిపికే చెందిన రేవంత్ రెడ్డి, సండ్ర లాంటి వాళ్లు ఓటుకు కోట్లు కేసులో ఎమ్మెల్యేల కొనుగోళ్లకోసం చెమటోడ్చి కష్టపడి వార్తల్లో నిలిచారు. ఇపుడు దీపక్ రెడ్డి తన బాధ్యత నిర్వర్తించారు.
ఇక్కడ ఏపీలోనూ మంత్రి గంటా విశాఖలో వేలాది ఎకరాల భూకుంభకోణంలో కీలకపాత్ర పోషించారని పాపం మరో మంత్రి అయ్యన్న పాత్రుడే కల్మషం లేకుండా చెప్పారు.
తెలుగుదేశం పేరు నిత్యం జనం చెవుల్లో మార్మోగుతూ ఉండాలన్నది చంద్రబాబు లక్ష్యం.
ఆ లక్ష్యాన్ని చేధించడానికే పార్టీ నేతలు రేయనక పగలనక కష్టపడుతున్నారు.
రాజధాని ప్రాంత రైతులనుండి కారు చౌకగా భూములు కొట్టేసిని టిడిపి మంత్రులు..ఎమ్మెల్యేల పేర్లు పత్రికల్లో నిత్యం కినపిస్తూనే వచ్చాయి. విశాఖ భూకుంభకోణంలో మంత్రి గంటాతో పాటు పార్టీలోని చిన్నా మధ్యతరహా నేతలూ కీలక పాత్ర పోషించి పార్టీకి మంచి పేరు సంపాదించి పెట్టారు.
ఇసుక అక్రమ తవ్వకాలతోనూ..మాఫియా కార్యకలాపాలతోనూ పార్టీ నేతలు ఇప్పటికే పార్టీ కీర్తి ప్రతిష్ఠలు పెంచిన సంగతి తెలిసిందే. మరో పక్క పార్టీ నేతలు మహిళలపై దాడులను ప్రోత్సహిస్తూ....మహిళా సాధికారత కోసం అహోరాత్రులూ శ్రమిస్తున్నారు.
సాధారణ మహిళలతో పాటు..పార్టీకి చెందిన మహిళలను కూడా అడుగడుగునా కంటతడి పెట్టిస్తూ చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నారు.
పార్టీ నేతలు ఎంత అల్లరి చేసినా..ఎన్ని తప్పులు చేసినా.. వారిని ఏమీ అనకుండా చంద్రబాబు చాలా సంయమనం పాటిస్తూ పార్టీ ప్రతిష్ఠను కాపాడుకొస్తున్నారు.
అటు తెలంగాణలోనూ...ఇటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ కూడా తెలుగుదేశం పార్టీ పేరు ఏదో ఓ కారణంతో జనం చెవుల్లో మార్మోగుతూనే ఉంది.
...............................