ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జ‌ల‌కు ద్రోహం చేసే కార్య‌క్ర‌మాలు మానుకోవాలి

ఓటీఎస్‌పై టీడీపీ దుష్ప్ర‌చారం స‌రికాదు

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి

తూర్పు గోదావ‌రి:  ఓటీఎస్ ప‌థ‌కం ద్వారా ప్ర‌భుత్వం పేద‌ల‌కు మేలు చేసే కార్య‌క్ర‌మాలు చేస్తుంటే ప్ర‌తిప‌క్షాలు అడ్డుకుంటూ ద్రోహం చేస్తున్నాయ‌ని టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి మండిప‌డ్డారు. తూర్పు గోదావ‌రి జిల్లాలో బుధ‌వారం ప‌ర్య‌టించిన ఆయ‌న ఓటీఎస్‌పై ప్పందించారు.  రాష్ట్రంలో దాదాపు 52 లక్షల మందికిపైగా మంచి జరిగే ఓటీఎస్ కార్యక్రమానికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శ్రీకారం చుట్ట‌డం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.  పిల్లలకు ఒక ఆస్తిగా ఇల్లు ఇవ్వాలని ఆరాట పడే పేదల కలలను నిజం చేస్తూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఓటీఎస్ ప‌థ‌కాన్ని  తెచ్చార‌న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పేదలకు ఇంటి పట్టాలు, స్థలాలు మాత్రమే ఇస్తున్నారు కానీ వాటిపై హక్కులు కల్పించడం లేద‌న్నారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా 52 లక్షలకుపైగా కుటుంబాలకు రూ.1.58 లక్షల కోట్ల విలువైన ఆస్తిపై సంపూర్ణ హక్కులు కల్పిస్తున్నార‌ని తెలిపారు.  ఇంటిపై హక్కులు దక్కితే అవసరం వచ్చినప్పుడు మార్కెట్‌ రేటుకు అమ్ముకునే వీలుంటుంద‌న్నారు. ఇప్పటిదాకా ఆ అవకాశం లేదు. వారసత్వంగా సంతానానికి రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చే వీలు కూడా లేద‌న్నారు. కష్ట కాలంలో తనఖా పెట్టి బ్యాంకు రుణాలు తీసుకునేందుకూ వీల్లేదు. ఏ హక్కూ లేకుండా గత ప్రభుత్వాలు ఇచ్చిన ఇళ్లలో గడపాల్సిన పరిస్థితి ఉండేద‌న్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెచ్చిన ఓటీఎస్ ప‌థ‌కంతో పేద‌ల‌కు సొంతింటి క‌ల నెర‌వేరుతుంద‌ని, ప్ర‌తిప‌క్షాలు దుష్ప్ర‌చారం చేయ‌డం మానుకోవాల‌ని వైవీ సుబ్బారెడ్డి హిత‌వు ప‌లికారు.
 

Back to Top