సీఎం వైయ‌స్‌ జగన్ క్లారిటీతో ఉన్నారు 

 వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి 

విశాఖపట్నం: అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గాల ఇన్‌ఛార్జిల మార్పు విషయంలో పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్లారిటీతోనే ఉన్నారని వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో గ్యాప్‌ రావడంతోనే పార్టీ పనులు చూసుకుంటున్నట్లు తెలిపిన వైవీ సుబ్బారెడ్డి.. తాను పోటీ చేసే విషయంలోనూ సీఎంవైయ‌స్ జగన్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. 

సీట్ల మార్పుల విషయంలో సీఎం వైయ‌స్ జగన్‌ స్పష్టంగా ఉన్నారు. గెలుపునకు దూరంగా ఉన్న అభ్యర్దులను సీట్లు ఉండవని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు.అందుకు తగ్గట్లే మార్పులతో మూడు జాబితాలు విడుదల చేశాం. కొత్త మార్పులు, చేర్పులకు సంబంధించిన  ఫైనల్‌ లిస్ట్‌ పండుగ తర్వాత వస్తుంది. సిట్టింగ్‌లు కొత్త అభ్యర్థులతో అడ్జస్ట్‌ కావడానికి కొంత టైం పడుతుంది. సీనియర్లు వాళ్ల వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. అల్టిమేట్ గా ట్రాక్ రికార్డును బట్టే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఫైనల్ అవుతాయి అని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. 

ఇక ఒంగోలు లోక్‌సభకు పోటీ చేయనని సీఎం వైయ‌స్ జగన్‌కు చాలాసార్లు చెప్పానని, పోటీ చేయాలనుకుంటే 2019 ఎన్నికల్లోనే పోటీ చేసేవాడిని, కంటిన్యూ అయ్యేవాడ్ని అని చెప్పారు.  ప్రత్యక్ష రాజకీయాలకు గ్యాప్‌ రావడంతోనే పార్టీ పనులు చూస్తున్నానని చెప్పిన వైవీ సుబ్బారెడ్డి.. అయితే అంతిమంగా పోటీ చేసే విషయంలో వైయ‌స్ జగన్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.

ఇక బీసీలకు ప్రభుత్వం ఏమీ చేయలేదని విమర్శ సరికాదన్న ఆయన.. దేశంలో బీసీలకు అత్యదిక ప్రాధాన్యం ఇచ్చిన సీఎంగా వైయ‌స్  జగన్ చరిత్ర సృష్టించారని అన్నారు. మా వల్ల మీ కుటుంబాల్లో మేలు జరిగితేనే మాకు ఓటెయ్యండని సీఎం వైయ‌స్ జగన్ చెబుతున్నారని.. అంత ధైర్యంగా చెప్పే సీఎం ఈ దేశంలో ఎవరూ లేరని అన్నారాయన.  అలాగే.. కాంగ్రెస్‌లో షర్మిల చేరికతో వైయ‌స్ఆర్‌సీపీకి ఎలాంటి నష్టం లేదని, ఆమెను దృష్టిలో పెట్టుకుని మార్పులు చేసేదేమీలేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టత ఇచ్చారు.

Back to Top