పెంచిన వాళ్ళను కాటేయడమే బాబు-రామోజీల బుద్ధి

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి  
 
వైట్ కాలర్ నేరాల్లో బాబు,రామోజీలు కవలల జంట

పైకి పెద్ద మనుషులు.. చేసేవి నీచపు పనులు

పిల్లనిచ్చిన మామను ముంచింది ఒకరు.. బతుకునిచ్చిన వ్యక్తికి పంగనామాలు పెట్టింది మరొకరు

ఇద్దరి నేరాల్లో సారూప్యత, సామీప్యత కనిపిస్తోంది. 

చంద్రబాబు, రామోజీ ఎంత నీచులో నిరూపితమైంది

మోడ్రన్ గజదొంగల ముఠా నాయకులు బాబు-రామోజీ

వీళ్లకేమైనా ప్రత్యేకమైన చట్టం, న్యాయం ఉండాలా..?

స్కిల్ స్కాంలో పక్కా ఆధారాలతో దొరికినా.. టీడీపీ పూటకో డ్రామా!

  బాబు బట్టలిప్పి కుటుంబ సభ్యులే రోడ్డు మీద నిలబెట్టారు. 

 వందల కోట్లు అవినీతి చేసి కక్షసాధింపు అంటే ఎలా?

 వీళ్ల తీరు చూస్తే.. కుదిరితే కోర్టును కూడా బోను ఎక్కిస్తారేమో? 

 దేశంలో ఎవరికీ లేని హక్కులు ఈ దొంగల ముఠాకు ఎందుకుంటాయి?

 సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేప‌ల్లి:  పెంచిన వాళ్ళను కాటేయడమే బాబు-రామోజీల బుద్ధి అని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమ‌ర్శించారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిస్తే.. మార్గదర్శి షేర్‌ హోల్డర్‌ జీజేరెడ్డి కుటుంబాన్ని రామోజీరావు బెదిరించి షేర్లు బదిలీ చేయించుకున్నాడు. చంద్రబాబు, రామోజీ ఎంత నీచమైన మనుషులో నిరూపితమైంద‌ని పేర్కొన్నారు.  రామోజీ ఎదుగుదలకు కారణమైన జీజేరెడ్డి కుటుంబాన్ని గౌరవంగా చూసుకోవాలి. కానీ, జీజేరెడ్డి కుటుంబ సభ్యులను బెదిరించి బలవంతంగా షేర్లు లాక్కున్నార‌ని సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం అయిన రెండు నెలలకే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు. కోర్టుల తీర్పులు ఎలా ఉన్నా వీళ్ల నిజస్వరూపం ప్రజలకు అర్థమవుతోందని సజ్జల రామ‌కృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.  బుధ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.  

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఏమ‌న్నారంటే..

రాజకీయ జీవితం ఇచ్చిన, తండ్రి లాంటి ఎన్టీఆర్ ను ముంచింది ఒకరు అయితే.. టైపిస్టుగా చేర్చుకుని వ్యాపారంలో ఆశ్రయమిచ్చి, బతుకునిచ్చిన పెద్దన్నలాంటి జీజే రెడ్డికి పంగనామాలు పెట్టింది మరొకరు. వీరిద్దరిదీ ఒకటే బుద్ధి. పెంచినవాళ్ళను, బతుకునిచ్చిన వాళ్ళను కాటేయడమే వీరి పని. ఇద్దరి నేరాల్లో సారూప్యత, సామీప్యత కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే వీరిద్దరూ ఒకటి అయ్యారు. ఒకరు చంద్రబాబు-మరొకరు రామోజీ. వైట్ కాలర్ నేరాల్లో వీరిద్దరూ కవలల జంట. పైకి పెద్ద మనుషుల్లా ఛలామణి అవుతారు. చేసేవి నీచపు పనులు. వీళ్లను పెద్ద మనుషులు అనాలా..? రాక్షసులు అనాలా..?.. అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. 

రోజుకో డ్రామాతో బాబు అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం:
- చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరు సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంది. 
- లేని సమస్యను వాళ్లే క్రియేట్‌ చేస్తూ, అవినీతి కేసులో ఆధారాలతో సహా ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు అరెస్ట్‌ అయితే నానా హంగామా చేస్తున్నారు. 
- రచ్చకెక్కి అసలు చేసిన అవినీతి బటయకు రాకుండా...ప్రజల దృష్టిని మరల్చి చర్చ జరగకుండా చేస్తున్నారు. 
- 2014లో తెలుగుదేశం పార్టీకి అధికారం అప్పజెప్తే ఆ పార్టీ అధినేతే ఒక కుంభకోణానికి తెరలేపి దొరికిపోయాడు. 
- సాంకేతిక పరమైన అంశాలను తెరమీదకు తెచ్చి అవినీతి అంశాన్ని పక్కకు నెట్టేస్తున్నారు. 
- ఆయనకు జలుబు చేసినా, చర్మవ్యాధులు ఏమైనా ఉంటే వాటిని ప్రాణాంతకమైన వ్యాధి అన్నట్లుగా చూపుతున్నారు. 
- జైలు నిబంధనలే కాదు..ఇంకేవీ అడ్డం రాకూడదు..ఇదేదో మానవత్వానికి సంబంధించిన అంశమైనట్లు, ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తిస్తోందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 
-చంద్రబాబు అరెస్ట్‌ జరిగి 40 రోజులైతే వీళ్ల డ్రామాలకు కూడా 40 రోజులుగా సాగుతూనే ఉంది. 

చంద్రబాబు, రామోజీ కేసుల మధ్య సామీప్యత ఉంది:
- రాజగురువు రామోజీరావు చేసిన ఒక మోసం పచ్చిగా, నగ్నంగా ప్రజల ముందుకు వచ్చింది. 
- చంద్రబాబు అయితే, ప్రభుత్వ సొమ్మును నేరుగా కొట్టేశారు.. రామోజీరావు తన కంపెనీలోని ఒక షేర్‌ హోల్డర్‌ను బెదిరించి షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్నాడు. 
- ప్రజల ముందు ఈ ఇద్దరు పరస్పరంగా పరాన్నబుక్కులుగా నిలిచిపోతారు. 
- ఎన్టీఆర్‌ను దించడంలో ఇద్దరూ కలిసి చేసిన చరిత్రలో గుర్తుండి పోయే ఒక చీకటి ఘట్టం. 
- ఎన్టీఆర్‌కు, లక్ష్మీపార్వతికి మధ్య ఉన్న సంబంధానికి అనైతికతను జోడించడం నుంచి చంద్రబాబుకు కథ స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ రామోజీనే. 
- అక్కడి నుంచి ఇద్దరూ కలిసి ఇప్పటికీ వారి సంబంధం అలానే నడుస్తోంది. 
- ఈ రోజు ఇద్దరి మోసాలు బయటపడటంతో.. ఎలాంటి వాళ్లు జోడి కట్టారన్న విషయంలో ప్రజలు మన ఖర్మ అనుకుంటున్నారు. వీళ్లు ఒక నిర్ణయాత్మక స్థానాల్లో ఉండటం దురదృష్టకరం. 
- దిక్చూచిలా ఉండాల్సిన మీడియా మొఘల్‌ రామోజీరావు అత్యంత దుర్మార్గుడు, మోసగాడు అని బయటపడింది. 
- అప్పటికే తాను అహంకారంతో వందల కోట్లు తినేయగల చంద్రబాబుతో జత కట్టే ఉన్నారు.
- ఈ ఇద్దరి మధ్య, కేసుల మధ్య సారూప్యత, సామీప్యత కనిపిస్తోంది. 
- తండ్రి లాంటి వాడిని చంద్రబాబు ముంచితే...పెద్దన్న లాంటి జీజే రెడ్డిని రామోజీ ముంచాడు.  

బతుకునిచ్చిన జీజే రెడ్డికే పంగనామాలు పెట్టిన రామోజీ:
- చంద్రబాబు పిల్లనిచ్చిన మామను అత్యంత క్రూరంగా వెన్నుపోటు పొడిచాడు. 
- అదే రీతిలో రామోజీరావు కూడా అదే విధంగా, అతనికి వ్యాపారపరంగా జీవితాన్ని ఇచ్చి జీజే రెడ్డి షేర్లను కొట్టేశాడు. 
- కొండపల్లి సీతారామయ్య రిఫరెన్స్‌తో జీజేరెడ్డి వద్దకు వెళ్లి టైపిస్టుగా ఉద్యోగంలో చేరాడు రామోజీరావు. 
- ఆయనకు సన్నిహితుడిగా ఉంటూ వ్యాపారం పెడతానని అప్పట్లో 1960ల్లో రూ.5వేలు తీసుకుని పెట్టుబడిగా స్టార్ట్‌ చేశాడు. 
- ఆ పెట్టుబడితో జీజే రెడ్డిని ప్రమోటర్‌ డైరెక్టర్‌గా షేర్లు అలాట్‌ చేశారు. ఆ షేర్లు 2016 వరకూ కొనసాగాయి. ఆయన కొడుకులు వచ్చి అడిగితే కానీ విషయం బయటపడలేదు. 
- ఇందులో ఏదీ రామోజీరావు లేదనడం లేదు. ప్రతి ఒక్కటీ కరెక్టే అంటున్నాడు. ఇక్కడ చిన్న తమ్ముడిలా చూసుకున్న జీజే రెడ్డి పెట్టిన పెట్టుబడిపై కంపెనీ పెట్టి దాన్ని ఎలా ఎగ్గొట్టాలా అని చూశాడు. ఆయన కొడుకులు వస్తే తుపాకి పెట్టి బెదిరించి స్టాంప్‌ పేపర్లపై సంతకాలు చేయించుకున్న కేసు ఇది. 
- జీజే రెడ్డిని ముంచి తన వ్యాపార సామ్రాజ్యం, మహాసౌదాన్ని రామోజీ నిర్మించుకున్నాడు. 
- కొండత మనిషి రామోజీరావు అసలు స్వరూపం ఇంత నీచంగా ఉంటుందని ఈ రోజు బయటపడింది. 

పెంచిన వాళ్ళనే కాటేసే బుద్ధి వారిది:
- నిజంగా ఆయన అన్నట్లు 228 షేర్లకు రూ.2.88 లక్షలే అయితే..మీ షేర్లు అన్నీ ఆ రేటుకు ఇవ్వగలరా?.  వాళ్లు వచ్చి అడిగినప్పుడు వాళ్లు సంతృప్తి పడేలా ఇచ్చి ఉంటే ఇంత వివాదం ఎందుకు? 
- నువ్వు బంగారు సింహాసనం మీద కూర్చుని జీజే రెడ్డి కొడుకులను రోడ్డున నిలబెట్టావు. వాస్తవంగా జీజే రెడ్డి నీకు చేసిన సాయానికి ఎంతో చేసి ఉండాల్సింది. వాళ్లని బంగారు సింహాసనంపై కూర్చోబెట్టాలి. నీకు వస్తున్న లాభాల్లో జీజే రెడ్డి కొడుకులకు వాటా రావాలి. 
- అన్యాయంగా, దుర్మార్గంగా చేతిలో పైసా పెట్టి దాన్నే లక్షలు అనుకో అంటూ బలవంతంగా వాళ్లని తోసేశావు. ఇక నువ్వు ఏ మొహం పెట్టుకుని వాదించగలవు? 
- సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యే మనుషులు వీళ్ళు, మేం మార్గదర్శకులం.. అని చెప్పుకునే మనుషులు ఇలాంటి నీచమైన పనులు చేశారు. తమను పెంచిన వారినే కాటేయగలమని చంద్రబాబు-రామోజీలు నిరూపించారు. 
- వీళ్లు వాడుకుని వదిలేయడమే కాకుండా, అవసరమైతే ఎవరైతే ఉపయోగపడ్డారో వాళ్లని కూడా విలన్‌ లు గా చూపగల శక్తివంతులు. వీళ్లను పెద్ద మనుషులు అనాలా..? రాక్షసులు అనాలా..?
- మహానుభావుల లక్షణాలు అక్కర్లేదు..మనుషుల లక్షణాలైనా వీరికి ఉన్నాయా? 
మనకు ఎవరైనా సాయం చేస్తే జీవితం అంతా గుర్తు పెట్టుకుంటాం. నీతులు చెప్పే రామోజీ అది చేయకపోగా, తన చేత బిజినెస్‌ పెట్టించిన వ్యక్తి కొడుకులను గన్‌ పెట్టి బెదిరించడం అత్యంత దారుణం. గన్‌ చూపించాడు అనడానికి సాక్ష్యం వేరే అక్కర్లేదు..నువ్వు షేర్‌ వాల్యూని డిపాజిట్‌ చేయకపోవడమే దానికి నిదర్శనం. దీనికి ఎన్ని గింగిరాలు కొట్టి ఎన్ని చెప్పినా తప్పించుకోలేడు. 
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచీ ఆయన ప్రభావశీలుడు. తిమ్మిని బమ్మిని చేయగలడు. ఆయన బుద్ధి బురదలో దొల్లుతుంది..లేదంటే సెప్టిక్‌ ట్యాంకులో పొర్లాడుతుంది. తెలుగు భాష చదివే వారందరికీ కూడా ఆయన ప్రభావ శీలుడే. అలాంటి వాళ్లు ఇంత నీచమైన స్వభావం కలిగిన వారు అని తెలియడం అవసరం. 
ఇలాంటి స్వభావం ఉండే వాళ్లు ఏం చేయగలరు అనే దానికి దీన్నే ఉదాహరణగా తీసుకుని అర్ధం చేసుకోవాలి. అందుకే ఆ పత్రికలో వచ్చే వాటిని ప్రజలు జాగ్రత్తగా గమనించి నిర్ణయాలు తీసుకోవాలి. 

సంపాదన కోసమే బాబు సీఎం అయ్యాడుః
- ఇద్దరి మధ్య ఒకే స్వభావం ఉంది..ఇద్దరూ ఒకరిని ఒకరు నెత్తికి ఎత్తుకునే వెళ్తున్నాడు. ఇద్దరూ ఒకరికి ఒకరు ఆలంబనగానే ఎదిగారు. ఇద్దరూ అలాగే ప్రజల ముందు ఎక్స్‌పోజ్‌ అయ్యి నిలబడ్డారు. 
- రామోజీ అక్రమ సామ్రాజ్యం అంతా ఇలా వచ్చిందే. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. 
- చంద్రబాబు సీఎం అయ్యిందే సంపాదన కోసం అన్నట్లు ప్రవర్తించాడు. ఆయన సీఎం అయిన రెండు నెలలకే చట్టాలు మార్పు చేసి ప్రజల సొమ్ము హెరిటేజ్‌ కోసం వాడుకున్నాడు. 
- ఇప్పటికీ ఆ ప్రజల సొమ్ము ప్రభుత్వానికి చెల్లించలేదు. డిఫర్డ్‌ టాక్స్‌ అంటూ తీసుకున్నది ఆరేడు కోట్లు ఉన్నట్లుంది. దాని మీదే హెరిటేజ్‌ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. 
- ప్రజల్లో రోజూ జవాబుదారీగా ఉండాల్సిన వ్యక్తుల జీవితాలు, నిర్ణయాలు ఎలా ఉండకూడదో చెప్పడానికి వీళ్లిద్దరినీ ఉదాహరణగా చెప్పవచ్చు. 

ఎంత కొట్టేస్తే కేసులు పెట్టాలో కూడా మీరే చెప్పండి:
- చంద్రబాబు ఒక ముఖ్యమంత్రిగా రూ. 371 కోట్లను ఫేక్‌ అగ్రిమెంట్‌ చూపించి కొల్లగొట్టాడు. అందులో రూ. 241 కోట్లు ఒక కంపెనీలోకి వెళ్లి..అక్కడి నుంచి షెల్‌ కంపెనీలకు వెళ్లి అక్కడి నుంచి డబ్బు డ్రా చేశారు. ఇది కేసు కాకుండా ఏమవుతుంది?. ఆయన తరఫున మాట్లాడుతున్న వారందరినీ నేను నేరుగా అడుగుతున్నాను. 
- ఇలాంటి అవినీతికి పాల్పడితే.. ఒక విచారణ సంస్థ ఇక ఎలాంటి లక్షణాలుంటే కేసు పెట్టాలో కూడా మీరే చెప్పండి. 
- ఈ కేసు బాబుకు సంబంధం లేదు అంటారు..కానీ జరిగిన దానిని మాత్రం కాదనలేకపోతున్నారు. 
- క్యాబినెట్‌ అప్రూవల్‌ అయిన రూ.3300 కోట్లు మీరు చూపలేకపోతున్నారు..అంటే సదరు ప్రాజెక్టు లేనట్లేగా. 
- అలా లేని ప్రాజెక్టుకు పది శాతం రూ. 371 కోట్లు విడుదల చేసి కొట్టేస్తే తప్పు జరిగినట్లు కాదా? 
- ఇది నేరుగా ముఖ్యమంత్రి ప్రమేయంతోనే జరిగిందని అధికారుల ఉత్తర ప్రత్యుత్తరాలు చెప్తున్నాయి. ఆయన సంతకాలు కూడా ఉన్నాయి. నువ్వే సంతకాలు చేశావ్‌..నీ మనిషే నిధులు విడుదల చేశాడు. ఆ నిధులు బయటకు వెళ్లిపోయాయి. బయటకు వెళ్లిన వాటి గురించి నీ పీఏని అడుగుదాం అనుకుంటే అతన్ని దేశం దాటి నువ్వే పంపించేశావు. ఇంత నేరుగా ఆయన పాత్ర ఉండటంతో కేసు పెట్టడంలో తప్పేముంది? 
- అరెస్టు చేసి, 24 గంటల్లో కోర్టు ముందు పెట్టారు. కోర్టు ఇవన్నీ ఆధారాలు ఉన్నాయనే జ్యుడిషియల్‌ కస్టడీలోకి తీసుకుంది. ఈ నిందితుడు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని తన కస్టడీలోకి తీసుకుంది. 

ప్రిజనర్స్‌కి హెల్త్‌ బులిటెన్‌ ఇస్తారా?:
- ఇంత స్పష్టత ఉంటే..కోర్టే రిమాండ్‌కు పంపితే..వీళ్లు ఘోరాలు జరుగుతున్నాయని చొక్కాలు చించుకుంటూ కింద పడి దొర్లడం ఎవర్ని మభ్యపెట్టడానికి? ఎంత అవినీతి చేసినా కేసు పెట్టడానికి వీళ్లేదని అంటారా? 
- ఇప్పుడేం ఆయనకు శిక్ష పడలేదు కదా..ఆయన్ను విచారించాలి అంటున్నారు. ఆయన పీఏ కూడా బయటకు వెళ్లిపోయాడు...అతను దొరికి ఉంటే 
ఇంత క్లియర్‌ కేసులో ఇంకా బుకాయించాలని చూస్తే ఎలా? 
- మొదటి రోజు నుంచీ డ్రామాలు మొదలుపెట్టారు. ముందు దోమలన్నారు..దోమతెర కడితే ఉక్కపోత అంటారు. 
తర్వాత రోగాలు వచ్చాయి..పట్టించుకోలేదు అంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నిబంధనలను ఫాలో కావాలి కదా? 
-లోకేశ్‌ నిన్న డీఐజీ వద్దకు వెళ్లి రచ్చ చేశాడు. చంద్రబాబును అక్రమంగా జైళ్లో పెట్టారని భావనను జనంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. 
- చివరికి ఆయనకున్న చర్మరోగాలను కూడా వారే బయటపెట్టి వీళ్లే చంద్రబాబును కించపరుస్తున్నారు. 
- వాటికి సంబంధించిన ట్రీట్‌మెంట్లు ఏమైనా ఉంటే జైలు అధికారులు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 
- రోజూ హెల్త్‌ బులిటెన్‌ అంటూ గొడవ చేస్తున్నారు. ప్రిజనర్స్‌కి ఎవరైనా హెల్త్‌ బులిటెన్‌ ఇస్తారా? ఆయన కోర్టు కస్టడీలో ఉన్నారు. కావాలంటే కోర్టులో అడగాలి. 
- ఆయన ఆరోగ్యంపై జైలు అధికారులు నివేదిక ఇస్తే దాన్ని వీళ్లే బయటకు లీక్‌ చేశారు. డీఐజీపై లోకేశ్‌ చిందులు వేసిన వీడియో కూడా బయటకు లీక్‌ చేశారు. 
- మీరు బయటకు లీక్‌ చేస్తున్నారు కాబట్టి మేం ఇవ్వలేమని అధికారులు చెప్పారు. కానీ రోజూ ఆయన ఆరోగ్యం గురించి అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
- ఒక పేషెంట్‌కు సంబంధించి గోప్యంగా ఉంచాల్సిన అంశాల్ని మీరు పబ్లిక్‌ చేసుకుంటున్నారు. ఆయన్ను బట్టలిప్పి రోడ్డు మీద మీ కుటుంబ సభ్యులు, పార్టీ వాళ్లు నిలబెడుతున్నారు. అందుకే మరుసటి రోజు వెళ్తే చంద్రబాబు వాళ్లనే తిట్టినట్లున్నాడు.  వీళ్లది పిల్ల చేష్టల స్థాయి కూడా మించి పోయింది. 

రోజూ ఏదొక రచ్చ చేయాలన్నదే వారి లక్ష్యం:
- లాయర్ల ములాఖత్‌లకు సంబంధించి అది అధికారుల నిర్ణయం. రోజుకు రెండు పెడితే ఇబ్బంది అవుతుందని అధికారులు, రోజుకు ఒక సారికి మించి వాళ్ల లాయర్లు ఏం మాట్లాడతారు..? దీన్ని కూడా అన్యాయం అంటూ గగ్గోలు పెడుతున్నారు. 
- నిన్న డీఐజీ వద్దకు వెళితే ఆయన కోర్టు పరిధిలో ఉన్న విషయం మీరు నన్ను కాదు కోర్టును అడగాలి అని చెప్తూనే ఉన్నారు. కానీ వాళ్లు ఇచ్చిన వీడియో చూస్తే అధికారులు అన్యాయంగా బిహేవ్‌ చేస్తున్నారనే ఇంప్రెషన్‌ క్రియేట్‌ చేసే విధంగా ఉంది. ఏదో ఒక విధంగా చంద్రబాబు చేసిన అవినీతి నుంచి దృష్టి మళ్లించేందుకే ఇవన్నీ చేస్తున్నారు. 
- ఒక రోజు దోమ మీద, ఒక రోజు ఆరోగ్యం మీద, మరో రోజు ములాఖత్‌లపై రచ్చ చేస్తున్నారు. 
- అసలు 20 ఏళ్లుగా వైద్యం చేస్తున్న వ్యక్తినే పంపాలి అనడంలో ఏమైనా అర్ధం ఉందా? ఏదైనా అడిగేది సాధ్యమయ్యేది అడగాలి..
- ఇక్కడేదో ఘోరాలు జరిగిపోతున్నాయి అని నమ్మబలికి ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు పెట్టాలంటే కుదరదు. 
- బయటకు వచ్చిన వాస్తవాలను చూసిన తర్వాత ఒక నాయకుడు అడ్డగోలుగా ప్రభుత్వ ఖజానాను దోచుకున్నాడు అనేది అర్ధమైంది. ఈ రోజు దొరికింది కొద్దిగే..ఇంకా చాలా ఉందనేది దేశమంతా అర్ధమైంది. 

తప్పులు చేసి, తప్పే లేదని కోర్టుకు వెళతారా?:
- ఎంత సేపు వీళ్లు కేసుకు సంబంధించిన అంశంపై కాకుండా, అసలు కేసునే కొట్టేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసు గురించి చర్చిద్దామంటే మాత్రం వీళ్లు ముందుకు రారు. 
- రామోజీ కూడా ఇదే రీతిలో క్వాష్‌ కోసం వెళ్లారు. చేసిందంతా చేసి కక్షసాధింపు అనే ఖాతాలో వేద్దామంటే కుదరదు. 
- రామోజీ అడ్డగోలుగా షేర్లు బదిలీ చేసుకోవడం తప్పా ఒప్పా? మీరే చెప్తారు...మీ టర్నోవర్‌ రూ.1200 కోట్లు అంటారు..
- మీరు చెప్పినట్లే అంత టర్నోవర్‌ ఉంటే ఇన్నేళ్ల బిజినెస్‌కు కేవలం రూ.39 లక్షల డివిడెండ్‌ మాత్రమే జీజే రెడ్డి కొడుకులకు వచ్చిందా? . షేర్లకు సంబంధించి వాటి విలువ కేవలం రూ.2 లక్షలేనా? 
- అసలు డబ్బు పెట్టిన జీజే రెడ్డి మెయిన్‌ ప్రమోటర్‌ అవుతాడు. అంతా వాళ్ల కొడుకులకు వెళ్లాలి. నువ్వు చేసింది మోసం కాదా? 
- ఇక్కడెందుకు కేసు పెట్టారు..జరిగింది హైదరాబాద్‌లో కదా అంటూ బుకాయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు కూడా ఇలానే వాదిస్తున్నాడు..వీరంతా దొంగల ముఠాలను నడిపే గజదొంగల ముఠాగా కనిపిస్తోంది. 

 సాంకేతిక అంశాలు చూపించి తప్పించుకునే ప్రయత్నం:

- వాళ్లు కేసుకు సంబంధించిన అంశంపై చర్చకు రారు. సాంకేతిక అంశాలను చూసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. 
- ప్రిజనర్‌ మాన్యువల్‌ను ఏనాడూ తప్పలేదు. వీళ్లు మాత్రమే మాన్యువల్‌లో లేని అంశాలను తీసుకొచ్చి రచ్చ చేస్తున్నారు. 
- జగన్‌ గారు ఏ రోజన్నా ఇలా ఒక్క ఫిర్యాదు అయినా చేశాడా? వీళ్లందరికీ ఒక ప్రత్యేకమైన చట్టం, న్యాయం ఉండాలా..? 
- ఆ ప్రత్యేకమైన న్యాయం కూడా వీళ్లు చెప్పినట్టే న్యాయం కావాలి అంటారు.
- ఈ ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం పెట్టాలంటే కుదరదు అన్నారు. అదే శాసనం అంటారు. 
- పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే వాళ్లు కుదరదు అంటే అదే శాసనం కావాలి అంటారు. 
- ఇదిగో ఈ కేసులో అవినీతి జరిగి మీపై ఆరోపణలు వచ్చాయి అంటే మమ్మల్ని అరెస్ట్‌ చేస్తారా, కుదరదు అంటారు. 
- మీరు బెదిరించి షేర్లు తీసుకున్నారు అంటే కుదరదు..నేను రామోజీని అంటాడు. 

వీళ్ల తీరు చూస్తే కోర్టును కూడా బోనులోకి ఎక్కిస్తారేమో?:
- భువనేశ్వరి గారిని కలుస్తామంటే ఎవరు అడ్డుకుంటారు..?. కావాలనే శాంతిభద్రతలకు ఆటంకం కలగకూడదు అంటే దుష్ప్రచారం చేస్తారు. 
మేం ఎన్ని చెప్పినా రోజూ ఏదో ఒకటి క్రియేట్‌ చేస్తూనే ఉన్నారు. 
- తప్పు చేసింది చంద్రబాబు అని చెప్పడానికి మేం తిప్పలు పడాల్సి వస్తోంది. వీళ్ల తీరు చూస్తుంటే కుదిరితే కోర్టును కూడా బోను ఎక్కిస్తారేమో?. కోర్టు, న్యాయ మూర్తి కూడా వీళ్లకి సంజాయిషీ ఇవ్వాలంటారేమో? 
- చివరికి అధికారులు, విచారణ అధికారులు, ప్రభుత్వం కూడా చేతులు కట్టుకుని నిలబడి వాళ్లని ఒప్పించాలేమో?. అందులో భాగంగానే ఈ పైత్యం వాళ్లకి పుట్టుకొచ్చినట్లుంది. 
- చివరికి సోషల్‌మీడియాలో జడ్జిని కూడా ఫోన్లో ఎవరితో మాట్లాడారు అంటూ అడిగారు. దేశంలో ఎవరికీ లేని హక్కులు ఈ దొంగల ముఠాకు ఎందుకుంటుంది? 
కేసు మీద మాట్లాడండి అంటే మాత్రం కక్ష సాధింపు అంటారు. 
- నువ్వు నీచుడివి కాకపోతే.. నువ్వు బతకడానికి సాయపడ్డ వారికి పది రూపాయలు ఎక్కువ ఇస్తే ఈ కేసు ఎందుకొచ్చేది రామోజీ..? 
- లక్షల కోట్ల ఆస్తులున్న నువ్వు వాళ్లని తుపాకీ పెట్టి బెదిరించావు.. ఫోర్జరీ చేశావనే ఆరోపణలు వచ్చాయి. 
- మీ ఇద్దరిపై కక్షసాధించడానికి జగన్‌ గారికి ఏం పనిలేదా? ఇద్దరూ కాటికి కాళ్లు చాపినవాళ్లే..మీపై కక్షసాధింపు ఎందుకు? 
- చంద్రబాబు, రామోజీ కవలల జంట..ఒకరు లేకపోతే మరొకరు ఉండలేరు. వారి ఆలోచనలు ఒకటే ఉంటాయి..వారిద్దరికీ కోర్టుల్లో లాయర్లు కూడా ఒకళ్లే ఉంటారు. 

Back to Top