తాడేపల్లి: ‘జగనన్నే మా భవిష్యత్తు’ పేరిట వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలోని 1.60 కోట్ల కుటుంబాలను నేరుగా కలిసే భారీ కార్యక్రమానికి రేపటి నుంచి శ్రీకారం చుట్టనుందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. అధికారంలో ఉన్న పార్టీగా, వైయస్ఆర్సీపీ పదాతిదళం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలతో మమేకమయ్యే భారీ సర్వే కార్యక్రమంగా దీన్ని చూడాలన్నారు. రేపట్నుంచి అంటే ఏప్రిల్ 7వ తేదీ నుంచి ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మొదలై ఈనెల 20 వరకు కొనసాగుతోందని చెప్పారు. ప్రతీ ఇంటి గడపకు గౌరవ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి సైనికులుగా మాపార్టీ పదాతిదళంగా, గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు కలిసి ఈ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో పనిచేస్తారని పేర్కొన్నారు. గృహసారథులు ఇంటింటికీ వెళ్తారు. వారిని సచివాలయ కన్వీనర్లు కోఆర్డినేట్ చేస్తారని వివరించారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు..
కోటి 60 లక్షల కుటుంబాలను కలిసే గొప్ప కార్యక్రమంః
దాదాపు 7 లక్షల మంది గృహసారథులు రాష్ట్రంలోని 1 కోటి 60 లక్షల ఇళ్లను ఈ 14 రోజుల్లో(ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 20) సందర్శిస్తారు. దాదాపు ఐదుకోట్ల మంది ప్రజలను ప్రత్యక్షంగా కలిసి ‘మమ్మల్ని మా జగనన్న పంపారు. మీతో మాట్లాడి.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై, ప్రభుత్వ పనితీరుపై మీ అభిప్రాయాల్ని తెలుసుకునేందుకు వచ్చాం..’ అని చెబుతారు. ఈ విధంగా మా పార్టీ పదాతిదళం కలిసే వారిలో అన్ని కులాలు, మతాలకు చెందిన వారితోపాటు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగిన కుటుంబాలు కూడా ఉంటాయి. అధికారంలో ఉన్న ఒక పార్టీ తరఫున అన్ని ఇళ్లకు నేరుగా మా సైనికులు వెళ్తారు. ఒక ఇంటికి వెళ్లినప్పుడు ‘మీకు మా ప్రభుత్వం ద్వారా ఏమేమి అందాయి..? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను ఏం గమనించారు..? ’ అని అడిగే సాహసోపేతమైన కార్యక్రమం ఇది. జగన్మోహన్రెడ్డి గారి మెసేజ్ను ఇంటింటికీ వినిపించి.. ప్రజల నుంచి వచ్చే మెసేజ్ను స్వీకరించి.. వారి మద్ధతుకోరి.. వారి మద్ధతు తీసుకుని మరో ఇంటికి వెళ్తారు.
వాక్ ది టాక్ అన్న విధంగా...:
ఇంతటి సాహసోపేతమైన భారీ కార్యక్రమాన్ని ఒక్క జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వమే.. వైఎస్ఆర్సీపీ పార్టీనే ఎలా చేయగలుగుతుందంటే.. ‘వాక్ ది టాక్’ అన్నట్లు స్వాతంత్య్రానంతరం ఎక్కడాలేని విధంగా కులమతాలకు అతీతంగా పూర్తి పారదర్శకంగా, మనం ఏదైతే మాట్లాడాతామో.. దాన్నే ఆచరించాలనే సిద్ధాంతంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని గర్వంగా చెబుతున్నాం. ఎక్కడా ఒక్క రూపాయి లంచం లేకుండా అర్హత ప్రమాణాల్లో పేదలను ఎక్కువగా చేరుస్తూ వారి సాధికారత దిశగా సంక్షేమాన్ని అందిస్తున్నాం.
ముఖ్యాంశాలుః
1. గత టీడీపీ ప్రభుత్వానికి.. ప్రస్తుత వైయస్ఆర్సీపీ పాలనను పోల్చి చెప్పే కరపత్రాలు అందిస్తారు
2. ప్రజా మద్దతు పుస్తకంలోని ప్రశ్నలు అడిగి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని నమోదు చేస్తారు
3. మద్దతు తెలిపిన వారికీ డోర్ మరియు మొబైల్ స్టిక్కర్లు ఇవ్వబడుతాయి
4. 82960 82960 నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరతారు
‘సంతృప్తి చెందితేనే.. ఆశీర్వదించండి..’అంటున్నాంః
గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గారు ఇటీవల సభల్లో చెబుతున్నట్లుగా ‘నాలుగేళ్లుగా, వచ్చే ఏడాదిలోనూ మా ప్రభుత్వం ద్వారా ప్రయోజనం నేరుగా మీ ఇంటి సభ్యులకు అందిందంటేనే.. మన ప్రభుత్వం పట్ల పూర్తిగా విశ్వసిస్తే.. మరోమారు ఆశీర్వదించండి..’ అని ధైర్యంగా, దమ్ముగా అనగలిగారంటే అందుకు కారణాలున్నాయి. ప్రపంచం మొత్తం ఆర్థికసంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో అందుకు అతీతంగా మన రాష్ట్ర ప్రభుత్వం పంటిబిగువున పేదవాడి సంక్షేమం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తోంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సంక్షేమం అందిస్తుందో.. దాన్నే సంక్షేమ క్యాలెండర్గా ఇటీవల అసెంబ్లీలో ప్రకటించారు. ఇన్నాళ్లూ అన్నిరకాలుగా వెనుకబడి ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకు చేయూతను అందించి పైకి తీసుకురావడంలో, మరీ ముఖ్యంగా మహిళల్ని అన్నిరంగాల్లో ముందుంచే కార్యక్రమాలు చేపట్టంలో మా పార్టీ నిర్మాణాత్మకంగా, బాధ్యతగా వ్యవహరించింది. సమాజంలోని అన్ని వర్గాల మధ్య అసమనానతలు తొలిగి, సమానత్వం వచ్చేలా, విజయవంతంగా సంక్షేమ కార్యక్రమాల్ని అమలు చేసి.. వాటి ఫలాల్ని చూస్తున్న క్రమంలోనే ఈరోజు ప్రజలతో మమేకమై వారి అభిప్రాయం తెలుసుకునే భారీ కార్యక్రమమే ‘జగనన్నే మా భవిష్యత్తు’.
ప్రజలిచ్చిన విశ్వాసమే ‘జగనన్నే మా భవిష్యత్తు’
రాష్ట్రంలో ప్రతీ పేదవాడి అవసరాలు గుర్తించి, వాటిని నూటికి నూరుశాతం తీర్చడమే కాకుండా వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని..వారికి వారుగా, తమంతటతాముగా నిర్ణయం తీసుకునే స్థాయికి వారి బతుకులు మార్చిన ప్రభుత్వమిది. భావితరాలు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి చదువు, ఉద్యోగాలు చేసేందుకు ఈ రాష్ట్రం ఒక వేదికగా ఉండేలా తీర్చిదిద్దిన పాలకుడు, గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గారు. ప్రజల్లో కూడా ఇలాంటి నమ్మకం బలంగా ధృఢంగా కనిపిస్తుంది కనుకనే ‘మా నమ్మకం నువ్వే జగన్’ అనే నినాదంతో ‘జగనన్నే మా భవిష్యత్తు’ అనే కార్యక్రమాన్ని నడుపుతున్నాం. ఈ నినాదం, ఈ కార్యక్రమం అనేది ప్రజల నుంచి వచ్చిందే గానీ.. తెలుగుదేశం పార్టీ తరహాలో.. వాళ్ళలా ఊహాలోకంలో విహరించి భ్రమల్లో బతకాలనే నైజం మా పార్టీది కాదు.
గతానికి ఇప్పటికీ తేడా చూడండిః
వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో మా తరఫున గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు ప్రతీ గడపగడపకు తిరిగి.. ప్రతీ ఇంటి తలుపు తట్టి ఒక కరపత్రం అందిస్తారు. కరపత్రంలో.. గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడాను వివరించే.. 2014 –19 హయాంలో జరిగిన పాలనను- ప్రస్తుత వైయస్ జగన్మోహన్రెడ్డి గారి పాలనతో పోల్చి చూపి.. చంద్రబాబు హయాంలో ఏం జరిగింది..? జగన్ గారి పరిపాలనలో ఏం జరుగుతుందనే విషయాలపై స్పష్టతనిస్తారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళల పరిస్థితులు, సాధికారతతో పాటు మరీ ముఖ్యంగా, ఈ మూడున్నరేళ్ళలో రూ. 2లక్షల కోట్లకు పైగా సంక్షేమ కార్యక్రమాలను డీబీటీ ద్వారా నేరుగా అర్హులైన పేదల ఖాతాల్లోకి జమచే సిన విషయాలతోపాటు, చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల పేరిట జలగల్లా ప్రజల రక్తాన్ని ఎలా పీల్చుకుతిన్నాయనేది.. ఇప్పుడు పారదర్శకంగా, అవినీతిరహితంగా సంక్షేమ పథకాలు ప్రజలకు ఏవిధంగా అందాయనేదానిపై అవగాహన కల్పిస్తారు.
తేడా ఇదీ..
- మన బడి నాడు - నేడు కార్యక్రమం ద్వారా జగనన్న ప్రభుత్వం- ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా తీర్చిదిద్దింది. దీంతో పేద విద్యార్థులకు డిజిటల్ క్లాస్రూంలు, అధునాతన ట్యాబ్లు, మెరుగైన టాయిలెట్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి.
- ఇంగ్లీష్ మీడియం చదువులతో పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోంది.
- అదే గత టీడీపీ హయాంలో ప్రభుత్వ పాఠశాల భవనాలు శిథిలావస్థకు చేరి కనీసం త్రాగు నీరు, టాయిలెట్ల ఉండేవి కావు.
- రాష్ర్ట చరిత్రలో తొలిసారిగా బీసీలను బ్యాక్ బోన్ క్లాస్ గా గుర్తించి వారికి రాజకీయాల్లో కీలక పదవులు ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ గారు కొత్త చరిత్ర సృష్టించారు.
- ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమ, ఆర్థిక పురోగతి కోసం అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.
- కానీ గత టీడీపీ హయాంలో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను కించ పరుస్తూ ‘ఎవరు మాత్రం ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారు’ అని తీవ్రంగా అవమానించారు.
- చంద్రబాబు తన పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఆర్థికంగా, రాజకీయంగా అణచివేసి తీవ్రంగా వేధించారు.
ప్రజామద్ధతు సర్వేతో..ః
ప్రస్తుతం జరిగే ‘గడపగడపకు మా ప్రభుత్వం’ కార్యక్రమంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయా..? లేదా..? అని మా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు అడుగుతున్నారో.. అదేవిధంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో కూడా..‘ప్రజామద్ధతు పుస్తకం’ పేరిట ఐదు ప్రశ్నలతో ప్రజలతో మా గృహసారథులు మాట్లాడుతారు. తద్వారా ఆయా కుటుంబాల మద్ధతును కూడగట్టే ప్రయత్నం చేస్తారు. తక్కువ సమయంలో మా ప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్ళి, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ మీకు ఏఏ పథకాలు అందుతున్నాయి..? గతంలో ఇలా ఉందా..? మా ప్రభుత్వంపై మీ అభిప్రాయమేంటి..? అనే ప్రశ్నలతో వారి సంతృప్తస్థాయిని తెలుసుకుంటారు. సంబంధంలేని రాజకీయాల జోలికి వెళ్లకుండా.. ఎవరికి వారు తమ కుటుంబాల గురించి మాత్రమే చెబుతారు. ప్రజలిచ్చే సమాధానాల్లోనే వైయస్జగన్మోహన్రెడ్డి గారికి వారి మద్ధతు వ్యక్తమౌతుంది.
8296082960 నెంబర్కు మిస్డ్కాల్తో..:
గృహసారథులు ఇంటింటికి తిరిగి ప్రజామద్ధతు పుస్తకం ద్వారా సర్వే జరిపి, వెంటనే వారికి ఒక కౌంటర్ ఫాయిల్ రసీదును అందజేస్తారు. అందులో 8296082960 అనే నెంబర్కు మిస్డ్కాల్ ఇవ్వడం ద్వారా ఒక నిముషం వ్యవధిలో ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్రెడ్డి గారి ఐవీఆర్ఎస్ వాయిస్తో మాకు మద్ధతు ప్రకటించినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ మెసేజ్ మిస్డ్కాల్ ఇచ్చిన మొబైల్కు అందుతుంది.
మద్ధతిచ్చిన వారి ఇంటిగడపకు స్టిక్కర్ః
జగనన్నే మా నమ్మకం అంటూ ఆయన పాలన పట్ల పూర్తి విశ్వసనీయత చూపి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్ధతు తెలిపిన కుటుంబానికి అభ్యంతరం లేనియెడల ఒక స్టిక్కర్ను అందజేస్తారు. వారు వారి ఇంటి తలుపు లేదా గడపకు అంటించుకుంటారు. మొబైల్కు అంటించుకునే స్టిక్కర్ను కూడా ఇస్తారు. ఇవన్నీ స్వచ్చంధంగా వారి ఇష్టానుసారంగానే వాటిని అందజేస్తారు.
ఎల్లో విషప్రచారాలకు చెంపపెట్టుగా..:
మేమేదో ఇతర పార్టీలు మాదిరిగా టెలిఫోన్ సర్వేలతో మాకు మేం చంకలు గుద్దుకునే కార్యక్రమంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ ను జరుపదలుచుకోలేదు. గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు నేరుగా ప్రజలను కలిసి.. గతానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడాను చెబుతూ.. జగన్మోహన్రెడ్డి గారి నాయకత్వాన్ని ఎందుకు కోరుకోవాలో.. వారి భావితరాల భవిష్యత్తుకు వైఎస్ఆర్సీపీకి అధికారం ఆవశ్యకతను వివరిస్తారు. ప్రతిపక్షాలను భుజానకెత్తుకున్న ఎల్లోమీడియానో, సోషల్మీడియానో అర్జెంట్గా చంద్రబాబును గద్దె మీద ఎలా కూర్చొబెట్టాలనే విషప్రచారాలకు చెంపపెట్టుగా మా వైయస్ఆర్సీపీ ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.