కేంద్ర కమిటీ ఎజెండా ఎందుకు మారింది?

త‌న ఎజెండా, అధికారులు ఏమిటో హోం మంత్రిత్వ శాఖ కమిటీకి తెలియదా? 

చంద్రబాబు, బీజేపీలోని టీడీపీ వ‌ర్గం శకుని పాత్రపై, జీవీఎల్‌ ప్రకటనపై చర్చ జరగాలి

వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ధ్వ‌జం

తాడేప‌ల్లి: కేంద్ర త్రిస‌భ్య క‌మిటీ ఎజెండా ఎందుకు మారింద‌ని, హోంమంత్రిత్వ శాఖ వేసిన క‌మిటీకి త‌న ఎజెండా ఏమిటో త‌న‌కే తెలియ‌దా..? త‌న అధికారులు ఏమిటో తెలియ‌దా..? అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి, ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. చంద్రబాబు శకుని పాత్రపై, ఆయన పంపించిన మనుషుల శకుని పాత్రపై, పరిధులు మీరిన జీవీఎల్‌ ప్రకటనపై కచ్చితంగా చర్చ జరగాల‌న్నారు. కేంద్ర క‌మిటీ ఎజెండా మార్పుపై ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు సంబంధించి త్రిసభ్య కమిటీ పరిధిలోకి తీసుకువచ్చిన తొమ్మిది అంశాలను మార్చాలని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు చేసిన ప్రకటన ఆయన మనస్తత్వాన్ని సూచిస్తోంద‌న్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా కేంద్ర కమిటీ ఒక అంశాన్ని చేరిస్తే జీవీఎల్‌ ఎందుకంత హడావిడి పడి సుమోటోగా దాన్ని తీసివేయాలని చెప్పారో, ఎందుకు ఆయనకు అంత ఆత్రమో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

తొమ్మిది అంశాల ఎజెండాలో ప్రత్యేక హోదా ఉండడాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ దీన్ని స్వాగతిస్తున్నాం అన్న ప్రకటన కూడా చేయకపోవడం, చంద్రబాబు మొహం మాడిపోవడం చూస్తే బీజేపీలోని టీడీపీ వర్గం, ప్రత్యేకించి సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు చంద్రబాబు ఆదేశాల మేరకు వెంటనే రంగంలోకి దిగి ఎజెండాను మార్పించారని స్పష్టమవుతుంద‌న్నారు.   

అన్నింటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం ఏమిటి అంటే.. హోం మంత్రిత్వ శాఖ వేసిన కమిటీకి తన ఎజెండా ఏమిటో తనకే తెలియదా? తన అధికారాలు ఏమిటో తమకే తెలియదా? అని ప్ర‌శ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ అధికారుల మధ్య ప్రత్యేక హోదా, రీసోర్సెస్‌ గ్యాప్‌ అన్నవి చర్చనీయ అంశాలు కాకపోయినా ఈ అంశాన్ని త్రిసభ్య కమిటీ నేరుగా ఏపీ అధికారులతో చర్చించవచ్చు కదా. మరి దాన్ని కూడా ఆపాలని ఎందుకు ప్రయత్నించారు? అని నిల‌దీశారు. 

ఆ కమిటీకి హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన జాయింట్‌ సెక్రటరీ నేతృత్వం వహిస్తున్నారని ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు చెప్పారు. వారికి తమ పరిధిలోకి వచ్చే అంశాలు, రాని అంశాలు ఏవో తెలియదని వెంటనే జీవీఎల్‌ రంగంలోకి దిగడం, ఆ వెంటనే బహిరంగంగా ప్రకటనలు చేయడం, ఆపైన కేంద్ర ప్రభుత్వ కమిటీ ఎజెండా మారిపోవడం ఈ మధ్యలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి మౌనం ఇవన్నీ చూస్తుంటే.. ఏం జరిగి ఉంటుందో అన్నది రాష్ట్ర ప్రజలంతా ఆలోచించాల‌న్నారు. చంద్రబాబు శకుని పాత్రపై, ఆయన పంపించిన మనుషుల శకుని పాత్రపై, పరిధులు మీరిన జీవీఎల్‌ ప్రకటనపై కచ్చితంగా చర్చ జరగాల‌న్నారు.

Back to Top