చంద్రబాబు వదిలిన విషపు బాణం షర్మిల

చంద్రబాబు కుట్రలో షర్మిల భాగమయ్యారు

 వైయస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి 

వైయస్ఆర్ పేరును శాశ్వతంగా చెరిపేసే కుట్ర

ఆ కుట్రలో షర్మిల కూడా కుమ్మక్కయ్యారు

భూమన కరుణాకర్‌రెడ్డి ఆక్షేపణ

రాజకీయాల్లో వైయ‌స్ జగన్‌ లాంటి వ్యక్తులు అరుదు

అధికారం కోసం అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇష్టపడరు

కాబట్టే వైయస్ఆర్ అభిమానులు ఆయన్నూ అభిమానిస్తున్నారు

అధికారం లేకపోయినా కోట్ల మంది వెంట నడుస్తున్నారు

గుర్తు చేసిన భూమన కరుణాకర్‌రెడ్డి
 
కుటుంబంలో, రాజకీయంగా షర్మిల ఒంటరయ్యారు

దాంతో చంద్రబాబు ఆమెను పావుగా వాడుకుంటున్నారు

తోబుట్టువులనే వంచించే వ్యక్తిత్వం చంద్రబాబుది 

బాబు తమ్ముడు రామ్మూర్తినాయుడే స్వయంగా చెప్పారు

ప్రెస్‌మీట్‌లో భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడి

తిరుపతి: మహానేత వైయస్ఆర్ పేరును, రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన మంచిని శాశ్వతంగా ప్రజల మనసు నుంచి తీసేయాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు కుట్రలో షర్మిల భాగమయ్యారని, తండ్రికి తగ్గ నాయకుడిగా ఎదిగి నిద్ర లేకుండా చేస్తున్న వైయస్‌ జగన్‌ను నేరుగా ఎదుర్కోలేక షర్మిల అనే విషపు బాణాన్ని చంద్రబాబు ప్రయోగించారని వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి వెల్లడించారు. ఆదివారం తిరుప‌తిలో భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

అలాంటి వ్యక్తులు అరుదు:
    రాజకీయాల్లో వైయ‌స్ జగన్‌ వంటి వ్యక్తులు అరుదన్న ఆయన, మాటకు కట్టుబడి నిలబడే జగన్‌ లాంటి వ్యక్తి నాయకత్వంలో పని చేస్తున్నందుకు వైఎస్సార్‌ అభిమానులు గర్వపడుతున్నారని చెప్పారు. అధికారం కోసం అబద్ధపు హామీలు ఇవ్వరని, అందుకే వైయస్సార్‌ అభిమానులంతా జగన్‌నూ అభిమానిస్తున్నారని, అధికారం లేకపోయినా కోట్లాది మంది వెంట నడుస్తున్నారని తెలిపారు. 

నిజాయితీకి మారుపేరు వైయ‌స్ జగన్‌:
    జగన్‌ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారన్న భూమన, 2009లో సోనియాగాంధీ నిబంధనలకు రాజీపడి ఉంటే జైలుకు వెళ్లాల్సిన పరిస్థితే వచ్చేది కాదని గుర్తు చేశారు. 2014లో రైతు రుణమాఫీ హామీ ఇచ్చి ఉంటే అధికారంలోకి వచ్చేవారమని తెలిసినా అబద్ధపు హామీ ఇవ్వలేనని నిజాయితీగా వ్యవహరించారు కాబట్టే ప్రతిపక్షంలో ఉండి పోయారని తెలిపారు.
    అటు కుటుంబంలోనూ, ఇటు రాజకీయంగానూ ఒంటరైన షర్మిల ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. పెళ్లైన 25 ఏళ్ల తర్వాత కూడా స్వార్జిత ఆస్తుల్లో చెల్లికి 40 శాతం ఆస్తిని ఈరోజుల్లో జగన్‌ కాబట్టే పంచగలిగారని, అందుకు అంగీకరించిన ఆయన సతీమణి భారతమ్మని అభినందించాలన్నారు. 

ఆ లేఖ టీడీపీకి ఎలా చేరింది?:
    ఆస్తుల మీద మమకారంతో వైయస్ఆర్ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చేలా తన అన్నకు రాసిన లేఖ లీక్‌ చేసి ఎల్లో మీడియాలో చర్చలు జరగడానికి కారణమైన షర్మిలను వైయస్ఆర్ అభిమానులు ఎప్పటికీ క్షమించరని ఆయన స్పష్టం చేశారు. తల్లి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీకి వత్తాసు పలికేలా వ్యవహరిస్తున్న షర్మిల.. ఆ పార్టీ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైన తన లేఖ, ఎంవోయూకు సమాధానం చెప్పాలని అన్నారు.
    ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోకుండా, అన్నింటా విఫలమైన చంద్రబాబు, ప్రతి నెలా డైవర్షన్‌ పాలిటిక్స్‌తో నెట్టుకొస్తున్నారని భూమన తెలిపారు. అందులో భాగంగానే ఈనెలలో వైయస్ఆర్ కుటుంబ ఆస్తుల వివాదాన్ని రాజకీయాలకు వాడుకుంటున్నారని చెప్పారు.  

చంద్రబాబు తోబుట్టువులకు ఏమిచ్చారు?:
    తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు.. అంటూ వైయ‌స్ జగన్‌ గురించి మాట్లాడిన చంద్రబాబు, తన సొంత చెల్లెళ్లకు, తమ్ముడికి ఎన్ని ఆస్తులు పంచాడో ప్రకటన చేయాలని భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
    చంద్రబాబు వ్యక్తిత్వం గురించి ఆయన సొంత తమ్ముడు రామ్మూర్తి నాయుడు తనతో చెప్పిన విషయాలను ఈ సందర్భంగా భూమన మీడియాతో పంచుకున్నారు.

రామ్మూర్తినాయుడు ఏం చెప్పారు?:
    అలిపిరి దాడి తర్వాత పరామర్శించడానికి వెళ్తే రామ్మూర్తినాయుడును బండ బూతులు తిట్టి అవమానించాడని.. మరో సందర్భంలో తిరుపతి వచ్చినప్పుడు తమ్ముడిని తిట్టిన చంద్రబాబు, తమ్ముడే తనను తిట్టినట్లు తల్లి అమ్మణ్నమ్మకు చెప్పారని.. తెలిపారు. ఒక విషయమై అరబిందో వారి నుంచి రూ.40 లక్షలు వసూలు చేసిన చంద్రబాబు, ఆ తర్వాత వారికి ముఖం చాటేసిన విషయాన్ని కూడా రామ్మూర్తి నాయుడు చెప్పారని వివరించారు.
    తమ కుటుంబ ఆస్తుల సమస్యను చంద్రబాబు తన రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్న విషయాన్ని షర్మిల ఇప్పటికైనా గ్రహించాలని హితవు చెప్పిన భూమన కరుణాకర్‌రెడ్డి, దుర్మార్గుడి చేతిలో పావుగా మిగిలిపోవద్దని ఆమెను హెచ్చరించారు.

Back to Top