అమరావతి: ‘మీరు దళితులు మీకెందుకురా రాజకీయాలు’ అంటూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగాయి. చింతమనేనీ..నోరు అదుపులో పెట్టుకొని దళితులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వైయస్ఆర్సీపీ నేతలు డిమాండు చేశారు. ఎమ్మెల్యే చింతమనేనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో దళిత సంఘాలు నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలకు దిగారు. చింతమనేనిపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేస్తున్నారు. దళిత వ్యతిరేకి, కుల అహంకారి అయిన ఎమ్మెల్యే చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండు చేశారు. దళిత జాతిని కించపరస్తూ.. మీకు పదవులు ఎందుకు రా.. అని ఎమ్మెల్యే మాట్లాడటం చాలా హేయమైన చర్య. చింతమనేనిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం’ అని దళిత నాయకులు హెచ్చరించారు. ‘ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారేం శివాజీ, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ దళితులపట్ల ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను ఖండించక పోవడం చాలా సిగ్గు చేటు. మాపై నిజమైన ప్రేమ ఉంటే కారెం శివాజీ, జూపూడి లిద్దరూ కూడా తక్షణమే తమ పదవులకి రాజీనామా చేయడంతో పాటు టీడీపీని వీడి బయటకు రావాలి’ అని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.