విశాఖపట్నం: ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజలకున్న ప్రతీ సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి.. వాటన్నింటిని పరిష్కరించగలిగారని, అందుకే ఇవాళ వైయస్ఆర్సీపీ సామాజిక సాధికార యాత్రకు ప్రజల ఆదరణ వస్తోందని, అపూర్వ స్పందన లభిస్తోందని వైయస్ఆర్సీపీ నేతలు అన్నారు. విశాఖలో శనివారం మధ్యాహ్నాం వైయస్ఆర్సీపీ బస్సు యాత్ర ప్రారంభమైంది. తగరపువలస ఫుట్బాల్ గ్రౌండ్ వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు పార్టీ రీజినల్ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు నేతలు హాజరయ్యారు. సందర్భంగా మీడియాతో మంత్రులు, పార్టీ నేతలు మాట్లాడారు. బాగోలేదు గనుకే బెయిల్ ఇవ్వండి అంటున్నారు: మంత్రి సీదిరి అప్పలరాజు పాదయాత్ర ద్వారా తెలుసుకున్న ప్రతీ సమస్య ఈ రోజు సీఎం పరిష్కరించారు. అందుకే బస్సు యాత్రకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ఈ యాత్ర ద్వారా సీఎం వైయస్ జగన్ మీద ప్రజలకు ఉన్న విశ్వాసం తెలుస్తోంది. ఇచ్ఛాపురం గజపతినగరం సభలో నభూతో నభవిష్యత్తు అన్నట్లు జన సందోహం తరలివచ్చింది. నారా భువనేశ్వరి సభకు, వైయస్ఆర్సీపీ బస్సు యాత్రకు.. బహిరంగ సభలకు వచ్చే జనాన్ని చూడండి. లోకేష్ యాత్రను మొదటి పేజీలో వేసుకోలేని స్థితిలో పచ్చ మీడియా వుంది. చంద్రబాబు తప్పు చేయలేదు బెయిల్ ఇవ్వండి అనడం లేదు.. బాగోలేదు గనుకే బెయిల్ ఇవ్వండి అంటున్నారు. కాబట్టి, చంద్రబాబు జైల్లో ఉండడమే సరైంది. బయటకు ఉంటే ప్రజలకు ప్రమాదం. అయినా చంద్రబాబు పూర్తిగా అవినీతిలో కూరుకు పోయారు.. ఇక బయటకు రాలేరని మంత్రి సీదిరి అప్పలరాజు ఎద్దేవా చేశారు. ఈ రాష్ట్రంలో ఇళ్లు లేని వ్యక్తులు రాజకీయం చేస్తున్నారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్నారు. సీఎం జగన్ ప్రజల కోసమే ఆలోచిస్తారు. దళితులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. దళితులను అక్కున చేర్చుకున్న వ్యక్తం వైయస్ జగన్. కేబినెట్లో దళితులకు పెద్దపీట వేసిన వ్యక్తి జగన్. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నామన్నారు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు..ఎన్ని అమలు చేశారు: మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ హయాంలో అభివృద్ధి జరగలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అప్పుడున్న తోక పత్రికలు బాబుకి వ్యతిరేకంగా ఏం రాయలేదు. చంద్రబాబు 600 హామీలు ఇచ్చారు..ఆ హామీలు అమలు చేయలేదు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా ఇచ్చిన హామీలు అన్ని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. ముసుగులు తీసి ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు కలుస్తున్నట్టు ప్రకటించారు. అప్పుల ఊబిలో ఏపీ అంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాలు పరిమితికి మించి అప్పులు చేస్తే కేంద్ర ఆర్థిక శాఖ చూస్తూ ఊరుకోదన్నారు. వారిది నిజం యాత్ర కాదు..అసత్య యాత్ర: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏపీలో నాడు-నేడుతో చదువులు మెరుగుపడ్డాయి. బాబు హయాంలో విద్యలో ఏపీ 15వ స్థానంలో ఉంటే.. ఇప్పుడు 3వ స్థానంలో ఉంది. ఏపీలో పేదరికం 11.5 శాతం నుంచి 6 శాతానికి తగ్గింది. పేదల ఇళ్ల నుంచి డాక్టర్లు, ఐఏఎస్లు రావాలని సీఎం జగన్ ఆలోచన చేశారు. బాబు హయాంలో ప్రజాధనం దోచుకున్నారు. సీఎం జగన్ పైసా.. పైసా పొదుపు చేసి ప్రజాసంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నారు. భువనేశ్వరిది నిజం యాత్ర కాదు.. అసత్య యాత్ర అని అభివర్ణించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం: మంత్రి మేరుగు నాగార్జున అంబేద్కర్ ఆలోచనలకు తగ్గట్లు సీఎం వైయస్ జగన్ పాలన సాగుతోంది. దళితులు, అణగారిన వర్గాలకు సీఎం జగన్ రాజ్యాధికారం ఇచ్చారు. అందరితో సమానంగా అణగారిన వర్గాలకు మేలు జరుగుతోంది. పవన్, లోకేష్, చంద్రబాబుకు ఈ రాష్ట్రంలో కనీసం ఇల్లు లేదు. ఏపీలో నివాసం లేని నాయకులకు ఇక్కడ మాట్లాడే హక్కు లేదు. పేదలకు కార్పొరేట్ వైద్యం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తోంది. 76 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు, ఎల్లో మీడియా ఇక్కడి ప్రజల సొమ్ముతో హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారు.