బీసీల ఆర్థిక అభివృద్ధికి కేంద్రం చేయూతనివ్వాలి

బీసీ స‌మ‌స్య‌ల‌పై పోరాటానికే సీఎం నాకు ఎంపీ ప‌ద‌విచ్చారు

వైయ‌స్ఆర్ సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఆర్‌.కృష్ణ‌య్య‌ 

న్యూఢిల్లీ: బీసీ సమస్యలపై వ‌చ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో గళమెత్తుతానని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు ఆర్‌. కృష్ణయ్య అన్నారు. బీసీ సమస్యలపై పోరాటానికే ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌ తనకు ఎంపీ పదవి ఇచ్చారన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఇప్పటికే ఇద్దరు కేంద్రమంత్రులను కూడా కలిసినట్లు వివరించారు. దేశంలో బీసీ రిజర్వేషన్లు 18 నుంచి 22 శాతం మాత్రమే ఉన్నాయ‌ని, ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీలకు సైతం జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేస్తూ బీసీ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు.

రాజ్యసభలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును పాస్‌ చేయాల‌న్నారు. బీసీ కులాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం రూ. 10 లక్షల నుంచి 20లక్షలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు రుణమాఫీ కాదు, బీసీల ఆర్థిక అభివృద్ధికి చేయూత ఇవ్వాల‌న్నారు. బీసీలకు చారిత్రక అన్యాయం జరిగిందని ఎంపీ ఆర్‌. కృష్ణయ్య ఆవేద‌న వ్య‌క్తం చేశారు. 

Back to Top