తిరుపతి: నకిలీ మద్యం వ్యవహారంలో నిజాన్ని నిగ్గు తేల్చేందుకు సీబీఐ చేత విచారణ జరిపించాలని వైయస్ఆర్సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి పద్మావతిపురంలో ఉమ్మడి జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి ఆధ్వర్యంలో వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై భైటాయించి ధర్నా నిర్వహించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి, నాయకులు విజయ నంద రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు బియ్యపు మధు సూదన్ రెడ్డి, అభినయ్ రెడ్డి, వెంకట గౌడ డాక్టర్ సునీల్, నారాయణ స్వామి, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, నూకతోటి రాజేష్ తదితరులు ఆందోళనలో పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి, భూమన మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు డైరెక్షన్లోనే రిమాండ్లో ఉన్న నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్థన్రావుతో కుట్రపూరితంగా వైయస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ వీడియో విడుదల చేయించారని మండిపడ్డారు. నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్ర హోమంత్రికి ఎంపీ మిధున్రెడ్డి లేఖ రాయడంతో, ఎక్కడ తమ బాగోతం బయటపడుతుందనే భయంతో చంద్రబాబు ఈ డైవర్షన్ వీడియోను విడుదల చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులు వరుసగా అరెస్ట్ అవుతున్నా, సిగ్గులేకుండా వైయస్ఆర్సీపీకి నకిలీ మద్యం బురద అంటించాలనే కుట్రతో చంద్రబాబు వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. నకిలీ మద్యం వ్యవహారంపై అసలు వాస్తవాలు వెలుగుచూడాలంటే సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు తన అనుకూల అధికారులతో వేసిన సిట్ విచారణ నిస్పక్షపాతంగా జరగదని స్పష్టం చేశారు. దీనిపై కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మద్యం ప్రియులకు నాణ్యమైన లిక్కర్ అందిస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చి, నకిలీ మద్యాన్ని అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. తమ పార్టీ నేతల చేతుల్లోనే మద్యం దుకాణాలు ఉండటం, దానికి అనుగుణంగా బెల్ట్షాప్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారానే ఈ నకిలీ మద్యాన్ని ఒక ప్రణాళిక ప్రకారమే విక్రయిస్తున్నారని విమర్శించారు.