తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లి, మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. ఈనెల 24న ఢిల్లీలో ధర్నాకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపునిచ్చింది. ఈ ధర్నాకు అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వనించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు పాల్గొననున్నారు. 24న ధర్నా ఈనెల 24న ఢిల్లీ వేదికగా ధర్నా నిర్వహించి రాష్ట్రంలో సాగుతున్న ఆటవిక పాలనపై గళమెత్తాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్న ఈ పోరాటంలో తమతో వచ్చే అన్ని పార్టీలనూ కలుపుకుపోతామని వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రకటించారు. అంతేకాక రాష్ట్రంలో జరిగిన విధ్వంసకాండపై ఢిల్లీలో బుధవారం జరిగే ధర్నాలో ఫొటోగ్యాలరీ ఏర్పాటు చేయడంతో పాటు వీడియోల ద్వారా దేశ ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నాన్ని చేస్తున్నామని ఆ పార్టీ ఎంపీలు తెలిపారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఇప్పటికే అపాయింట్మెంట్ కోరామన్నారు, అంతేకాక లోక్సభ, రాజ్యసభలోనూ పెద్ద ఎత్తున తమ వాణి వినిపిస్తామని ఎంపీలు చెప్పారు.