చేనేత రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి

కేంద్ర‌ప్రభుత్వానికి వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ: చేనేత రంగానికి ప్రత్యేక ఆర్థిక సహాయం వెంటనే ప్రకటించి సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేంద్ర ప్రభుత్వానికి వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభలో శుక్రవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా చేనేత‌ల అంశాన్ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి లేవనెత్తారు. దేశంలో దాదాపు 31 లక్షల కుటుంబాలు చేనేత రంగం ద్వారా జీవనోపాధిని పొందుతున్నాయ‌ని, చేనేత రంగంపై ఆధారపడిన కుటుంబాల్లో 87 శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయ‌ని చెప్పారు. ఈ రంగంలో పని చేస్తున్న వారిలో 72 శాతం మహిళ‌లే. చేనేత కార్మికులలో 68 శాతం వెనుకబడిన కులాలు, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన వారున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం తీవ్ర ఇక్కట్లకు గురైందని, చేనేత వస్త్రాలకు డిమాండ్ పడిపోయిందని గుర్తుచేశారు. అమ్మకాలు జరగకపోవడంతో చేనేత వస్త్రాల నిల్వలు పేరుకుపోయి.. ఫ‌లితంగా ఉత్పత్తి నిలిచిపోయింద‌న్నారు.   చేనేత కార్మికులపై దీని ప్రభావం తీవ్రంగా పడింద‌న్నారు. చేసేందుకు పనిలేక చేనేత కార్మికులు కుటుంబాలను పోషించలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నారని విజయసాయిరెడ్డి వివరించారు.

చేనేత రంగం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని విజ‌య‌సాయిరెడ్డి చెప్పారు. మొదటిది మార్చి 2020 నుంచి జనవరి 2022 మధ్యలో పత్తి, పట్టు నూలు ధరలు 69 శాతం పెరిగిపోయాయ‌ని, నూలు అందుబాటు ధరలకు లభ్యం కానందున చేనేత ఆర్థికంగా గిట్టుబాటు కాని పరిస్థితి ఏర్పడింది. రెండోది.. కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసిన రెండేళ్ళ వ్యవధిలో పేద, బడుగు వర్గాలకు చెందిన చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం ఎలాంటి సామాజిక భద్రత ప్రయోజనాలను అందించలేదని విజయసాయిరెడ్డి అన్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో చేనేత రంగం పునరుజ్జీవనం కోసం తక్షణం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పత్తి, నూలు వంటి ముడి సరుకులను సబ్సిడీపై అందించడంతోపాటు చేనేత పరిశ్రమ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 25 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించాలి. చేనేత కార్మికులకు సామాజిక భద్రత కల్పించే చర్యలు చేపట్టాలని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కేంద్ర‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Back to Top