తప్పు చేసి బీసీ కార్డు వాడుకోవడం దారుణం

అచ్చెన్నాయుడి అరెస్టుకు.. బీసీలకు ఏం సంబంధం

ఈఎస్‌ఐలో రూ.150 కోట్ల స్కామ్‌ జరిగిందని విజిలెన్స్‌ తేల్చింది

స్కామ్‌ల కోసం చంద్రబాబు బీసీలను కవచంలా వాడుకున్నాడు

తప్పు చేసిన వారెవరైనా జైలు ఊసలు లెక్కబెట్టక తప్పదు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి

తాడేపల్లి: ఈఎస్‌ఐ స్కామ్‌లో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా టీడీపీ నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తే దాన్ని బీసీలకు అపాదించడం సబబు కాదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అన్నారు. గత ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు చొరవతో ఈఎస్‌ఐలో రూ.150 కోట్ల అవినీతి జరిగిందని విజిలెన్స్‌ విచారణలో తేలిందన్నారు. ఈ మేరకే ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారన్నారు. అరెస్టుకు బీసీలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..

అచ్చెన్నాయుడు చొరవతో ఈఎస్‌ఐ డైరెక్టర్లు దాదాపుగా 975.79 కోట్ల మందులు కొనుగోలు చేసి అందులో రూ.100 కోట్లకుపైగా నకిలీ బిల్లులు సృష్టించి మొత్తం రూ.150 కోట్ల స్కామ్‌కు పాల్పడ్డారు. మందుల కొనుగోలుకు అప్పటి ప్రభుత్వం రూ.293 కోట్ల బడ్జెట్‌ కేటాయిస్తే.. రూ.698 కోట్లతో మందులు కొనుగోలు చేసినట్లుగా ప్రభుత్వానికి నకిలీ బిల్లులు చూపించి రూ.404 కోట్లు ఖజానాకు గండికొట్టారు. బడ్జెట్‌ కేటాయింపులోనే కాకుండా అధికంగా బిల్లులు లేకుండా నకిలీ మందులు బిల్లులు  కొనుగోలు చేసి అచ్చెన్నాయుడు కుంభకోణానికి పాల్పడ్డారు. 

అచ్చెన్నాయుడు బీసీ కులానికి చెందిన నేత అయితే.. అవినీతికి పాల్పడితే పట్టించుకోకూడదా..? బాధ్యత కలిగిన పదవిలో ఉండి స్కామ్‌లకు పాల్పడితే.. దానికి బీసీ కార్డును ఉపయోగించడం సబబు కాదు. చంద్రబాబు, లోకేష్‌ చేసే స్కామ్‌లకు బీసీలను కవచంగా ఉపయోగించుకుంటారా అని ప్రశ్నిస్తున్నా..? కార్మికులు వారి కష్టార్జీతం నుంచి ఆరోగ్య భద్రత కోసం దాచుకున్న డబ్బును కూడా గత ప్రభుత్వం లూటీ చేసింది. చంద్రబాబు హయాంలో అనేక విధాల కుంభకోణాలు జరిగాయి. అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 

విజిలెన్స్‌ విచారణ తర్వాత అరెస్టులు జరుగుతుంటే.. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని ప్రచారం చేయడం సిగ్గుచేటు, బాధాకరం. చంద్రబాబు బీసీల గురించి పాపానపోలేదు. బీసీల సంక్షేమం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. బీసీ నాయకుడు తప్పు చేస్తే.. బీసీ ప్రజానీకం మొత్తం తప్పుచేసినట్లా..? చంద్రబాబు, లోకేష్‌ బీసీలను అడ్డంపెట్టుకొని చేసిన కుంభకోణాలు భయటపడుతుంటే.. దానిపై కులం రంగు పులిమే పరిస్థితి. 

నామినేటెడ్‌ పద్ధతిల ద్వారా టెండర్లు కేటాయించడం ఇంతకు ముందే చూశాం. స్కామ్‌లను బయటకు తోడుతుంటే.. తెలుగుదేశం పార్టీ నేతలు గగ్గోలుపెడుతున్నారు. అచ్చెన్నాయుడిని అరెస్టు చేస్తే.. బీసీలను అవమానపరిచినట్లుగా మాట్లాడడం సిగ్గుచేటు. ఇది బీసీల సమస్య కాదు.. చంద్రబాబు హయాంలో ఈఎస్‌ఐలో ఇన్ని కుంభకోణాలు జరిగితే.. ఇంకా అనేక స్కామ్‌లు కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంది. తప్పనిసరిగా అన్ని స్కామ్‌లపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది. 

అవినీతి రహితంగా పాలన అందించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్ని పథకాలు పారదర్శకంగా అమలు చేస్తున్నారు. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. బీసీల ఆత్మబంధువు సీఎం వైయస్‌ జగన్‌. బీసీలను అడ్డంపెట్టుకొని స్కామ్‌లను చేసిన చంద్రబాబును బీసీ వర్గం క్షమించదు. రాబోయే రోజుల్లో అనేక స్కామ్‌లు బయటకువస్తాయి. తప్పుచేసిన వారు ఎవరైనా జైలు ఊసలు లెక్కబెట్టే పరిస్థితి వస్తుంది. 
 

తాజా వీడియోలు

Back to Top