కాసేప‌ట్లో శాసనసభా పక్ష స‌మావేశం

 శాసనసభాపక్ష నేతగా ఎన్నిక కాబోతున్న వైయ‌స్ జ‌గ‌న్‌
 

అమరావతి : వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ శాస‌న స‌భా ప‌క్ష స‌మావేశం కాసేప‌ట్లో ప్రారంభం కానుంది. పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి   శాసనసభాపక్షం నేతగా ఎన్నిక కాబోతున్నారు. ఆయన్ను తమ నేతగా ఎన్నుకోవడానికి కొత్తగా ఎన్నికైన ఆ పార్టీ ఎమ్మెల్యేలు  విజయవాడ తాడేపల్లిలోని వైయ‌స్ జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. ఉదయం సరిగ్గా 10.31 గంటలకు వైయ‌స్ఆర్‌సీపీ ఎల్పీ సమావేశం ప్రారంభం అవుతుందని  పార్టీ నేత‌లు చెప్పారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ఎమ్మెల్సీలు ఉదయం 9.45 నుంచి 10 గంటలలోపు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.

శాసనసభాపక్షం నేతగా వైయ‌స్ జగన్‌ను ఎన్నుకున్న తర్వాత 11.32 గంటలకు అక్కడే వైయ‌స్ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది.  సమావేశం ముగిశాక జగన్‌.. రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కలవడానికి హైదరాబాద్‌ బయలు దేరతారు.  వైయ‌స్‌జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారన్నారు.  

Back to Top