పల్నాడు: చంద్రబాబు నాయుడు కావాలనే మాచర్లలో అరాచకం సృష్టిస్తున్నారని, ప్లాన్ ప్రకారమే వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. కర్రలు, బండరాళ్లతో మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి రౌడీముఠా బీభత్సం సృష్టించిందని, టీడీపీ నేతల దాడిలో ముగ్గురు వైయస్ఆర్ సీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారన్నారు. మాచర్లలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై టీడీపీ దాడిని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీవ్రంగా ఖండించారు. గొడవకు కారకులైనవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘చంద్రబాబు కావాలనే మాచర్లలో అల్లర్లు సృష్టిస్తున్నాడు. ప్లాన్ ప్రకారం టీడీపీ నేతలు వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు. మాచర్లలో టీడీపీకి పార్టీ కార్యాలయమే లేదు. బ్రహ్మారెడ్డి ఉండే ఇంటిని టీడీపీ కార్యకర్తలే తగులబెట్టారు. ప్రజల్లో సింపథి కోసం చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు. చంద్రబాబు, లోకేష్ కలిసి ఆడుతున్న నాటకమిది. బ్రాహ్మారెడ్డి ద్వారా మాచర్లలో అలజడి సృష్టించారు. గొడవకు కారణమైనవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు, లోకేష్ ప్లాన్ ప్రకారమే బ్రహ్మారెడ్డిని అడ్డంపెట్టుకొని డ్రామాలాడుతున్నారు. రెచ్చగొట్టి గొడవలు చేయాలని చూస్తున్నారు. బీసీలు సీఎం వైయస్ జగన్వైపు ఉన్నారని తట్టుకోలేకపోతున్నారు. బీసీలను దూషించి దాడులు చేయడం హేయం’’ అని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.