వైయస్‌ఆర్‌సీపీని నేరుగా ఎదుర్కొలేక ఓట్లు తొలగింపు

వైయస్‌ఆర్‌సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పోలీసు వ్యవస్థ ఎప్పుడూ ఇంతలా దిగజారలేదు

సర్వే చేస్తున్న వారిని వదిలిపెట్టి పట్టుకున్న వారిపై కేసులా? 

చంద్రబాబుకు వంద ముసుగులున్నాయి

వైయస్‌ఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేస్తుంది

 

విజయవాడ: టీడీపీ నేతలు రాజకీయంగా ఎదుర్కొలేక వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని చంద్రబాబు అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడూ ఇంతలా దిగజారలేదని, ఇదంతా చంద్రబాబు ప్రోద్భలంతోనే జరుగుతుందన్నారు. సోమవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గంలో కొందరు యువకులు ట్యాబ్‌లతో సర్వేలు చేస్తూ పట్టుబడితే..వారిని పోలీసులకు అప్పగిస్తే..వారిపై ఫిర్యాదు చేసిన వారిపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. పోలీసులు టీడీపీ సర్వేలకు పూర్తిగా సహకారం అందిస్తున్నారనివిమర్శించారు. ప్రభుత్వ కుట్ర పోలీసుల ద్వారా జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకునే వీలు లేకుండా చేస్తున్నారని, ఇలాంటి చర్యలు దుర్మార్గమన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు వెళ్తే..ఆయన్ను కూడా అరెస్టు చేసి రాత్రంతా పోలీసుల బస్సులో తిప్పారన్నారు. ఎమ్మెల్యేను నానాభాషలతో దుర్భాషలాడారన్నారు. ఉదయం సత్యవేడులో ఐదు గంటలకు చెవిరెడ్డిని విడుదల చేశారన్నారు. ఎందుకు అరెస్టు చేశారో చెప్పే నాథుడు లేడన్నారు.

చంద్రబాబు అధ్వర్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ ఆదేశాలతో మా పార్టీ నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ విషయాలను ఎన్నికల కమిషనర్‌కు వివరించామన్నారు. గతంలో ఎప్పుడు కూడా అధికార పార్టీ ఇలా చేయలేదన్నారు. ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొనేందుకు పోలీసులను ఒక గుండాల మాదిరిగా చంద్రబాబు వాడుకుంటున్నారన్నారు. 13 జిల్లాల్లో యువకులు ట్యాబ్‌లు పట్టుకుని తిరుగుతున్నారని, వైయస్‌ఆర్‌సీపీకి ఓట్లు వేస్తామంటే వెంటనే తొలగిస్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ ఇంత దారుణంగా ఎప్పుడు ప్రవర్తించలేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దళితులను దుర్భాషలాడరన్నారు. చంద్రబాబు అడ్డదండలు ఉన్నాయి కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేపై కేసు పెట్టలేదన్నారు. ఏ తప్పు చేయని చెవిరెడ్డిని అకారణంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారన్నారు.

ముసుగు తీసి రండి అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు అన్నారు. వైయస్‌ఆర్‌సీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ చంద్రబాబు చెప్పడం సరికాదన్నారు. మా అధినేత ఇప్పటికే వైయస్‌ఆర్‌సీపీ ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. చంద్రబాబు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని  విమర్శించారు. చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో కూడా పొత్తులతోనే పోటీ చేశారన్నారు. అనేక పార్టీలతో కలిసి పోటీ చేసిన చంద్రబాబు మమ్మల్ని ముసుగు తీసుకొని రండి అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్‌ కళ్యాణ్‌పై రెండు నెలలుగా టీడీపీ ట్వీట్లు చేయడం లేదన్నారు. బీజేపీతో లోపాయికారి  ఒప్పందాలు పెట్టుకున్నారని తెలిపారు. బీజేపీ మహారాష్ట్ర అర్థిక మంత్రి భార్యను టీటీడీ సభ్యురాలిగా కొనసాగిస్తున్నారన్నారు. ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ రథంపై రాళ్లు వేస్తే..ఇది వైయస్‌ఆర్‌సీపీ నేతల పనే అంటూ లోకేష్‌ ట్వీట్‌ చేయడం చూస్తే టీడీపీ, జనసేన ఒక్కటే అని అర్థమవుతుందన్నారు.

2014లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా వైయస్‌ఆర్‌సీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే చంద్రబాబు విప్‌ జారీ చేసి అధికార పక్షానికి అండగా నిలవాలని చెప్పినట్లు గుర్తు చేశారు. దీన్ని ముసుగు అనరా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ కలిసే ప్రసక్తే లేదన్నారు. మాకు లోపాయికారి ఒప్పందాలు అసలే లేవని స్పష్టం చేశారు. వైయస్‌ఆర్‌సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. చంద్రబాబు అధికారం కోసం ఎవరి కాళ్లైనా పట్టుకుంటారన్నారు. చంద్రబాబుకు వంద ముసుగులు ఉన్నాయని వివరించారు. బాక్సైట్‌ తవ్వకాలకు చంద్రబాబు కాదా అనుమతి ఇచ్చిందని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ఒక అబద్ధాన్ని పది సార్లు చెబితే నిజమవుతుందా అని నిలదీశారు. ప్రపంచమంతా ఏకమైనా కూడా చంద్రబాబు తన దోరణì లో పని చేస్తున్నారని విమర్శించారు. ఓటుకు రూ.3 వేలు ఇస్తామని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. 
 

Back to Top