విజయ్‌కుమార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి

  ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

  తాడేపల్లి: దళిత ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిపై వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మండిపడ్డారు.  దళితులకు చంద్రబాబు చేసిన అన్యాయాన్ని రాష్ట్ర ప్రజలు మరిచిపోలేదన్నారు. విజయ్‌కుమార్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.బరి తెగించి ఆయన మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విజయ్‌కుమార్‌ను విమర్శించడం ద్వారా తన కుల దురహంకారాన్ని చంద్రబాబు మరోసారి బయట పెట్టుకున్నారని నిప్పులు చెరిగారు. ‘దళిత అధికారులంటే చంద్రబాబుకు చులకన భావం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన ఏకైక​ నాయకుడు’ అని ధ్వజమెత్తారు.

 దళితులపై చంద్రబాబు అనేక సార్లు దాడులు చేయించారని.. దళితుల భూములను దోచుకున్నారని దుయ్యబట్టారు. దళిత ఐఏఎస్ అధికారిపై నోరు పారేసుకున్న చంద్రబాబు పై ఎస్సీ,ఎస్టీ యాక్ట్ కింద కేసు పెట్టాలన్నారు. చంద్రబాబు 40  ఏళ్ల అనుభవం దళితులను అవమానించడమేనా అని ప్రశ్నించారు. దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు గతంలో కూడా దళితులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు తలుచుకుంటే చంద్రబాబు రోడ్లపై తిరగలేరని మేరుగు నాగార్జున హెచ్చరించారు.

Back to Top