శ్రీసత్యసాయి జిల్లా: పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాను ఏర్పాటు చేసిన సీఎం వైయస్ జగన్కు జిల్లా ప్రజానీకమంతా రుణపడి ఉంటుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి అన్నారు. కొత్త జిల్లా ఏర్పాటుతో ఈ ప్రాంతం అన్ని రంగాల్లో సులువుగా అభివృద్ధి చెందుతుందని, భూములున్న ప్రతి ఒక్కరైతులకు ఆర్థిక భరోసా ఏర్పడటంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నారు. వరుసగా ఐడో ఏడాది రెండో విడత వైయస్ఆర్ రైతు భరోసా సాయం విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్ శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి ప్రసంగించారు. ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి ఏం మాట్లాడారంటే.. 2019 ముందు రాష్ట్రంలో జరిగిన చంద్రబాబు దుర్మార్గపు పాలనలో వానజాడ లేక కరువు కటకాలతో అల్లాడిన ప్రజలు తినేందుకు తిండిలేక గంజి కేంద్రాలకు వెళ్లినరోజులు ఉన్నాయి. గొడ్డుకు గడ్డిలేక కబేళాలకు తరలించారు. వాన చినుకు లేక, పొలాల్లో పంటలు పండక కుటుంబాలన్నీ వలసలు వెళ్లినరోజులు ఉన్నాయి. చంద్రబాబు అంటేనే కరువు, కరువు అంటేనే చంద్రబాబు. చంద్రబాబు రెయిన్గన్ల పేరుతో రూ.450 కోట్లు దోచుకున్నాడు. ప్రజా సంకల్ప యాత్రతో ప్రజల కష్టాలు తెలుసుకున్న వైయస్ జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పాలనను అందిస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇచ్చిన మాట ప్రకారం.. అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నంబర్ 36 ఇచ్చి రూ.864 కోట్లతో పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులు నింపడమే కాకుండా హంద్రీనీవా జలాలు 3 టీఎంసీలు కేటాయించిన ముఖ్యమంత్రి మన జగనన్న. 2004లో అధికారంలోకి వచ్చిన తరువాత దివంగత మహానేత వైయస్ఆర్ అనంతపురానికి ఇచ్చిన వరం హంద్రీనీవా స్రుజల స్రవంతి. అనంతపురం జిల్లా నీరు తాగుతుందంటే అది మహానేత వైయస్ఆర్ చలవే. పారే ప్రతి చుక్కలో, పండే ప్రతి పంటలో పెద్దయన బతికే ఉన్నారు. జగనన్న పాలనలో పుట్టపర్తి నియోజకవర్గంలో 26 వేల ఇళ్లు నిర్మిస్తున్నాం. రూ.750 కోట్లు వెచ్చించి అక్కచెల్లెమ్మల సొంతింటి కలను నిజం చేస్తున్నాం. ముదిగుబ్బ నుంచి కోడూరు వరకు ఎన్హెచ్ 342 వైయస్ జగన్ ఆశీస్సులతోనే సాధ్యమైంది. రూ.1750 కోట్లు వెచ్చించి ఎన్హెచ్ 342 పనులు మొదలుపెట్టడం జరిగింది. అదే విధంగా ముద్దనూరు నుంచి హిందూపూరం వరకు దివంగత మహానేత వైయస్ఆర్ కల నాలుగు వరుస రోడ్లను జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ పనులు ప్రారంభించారు. గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బెంగళూరు నుంచి కొడికొండ చెక్పోస్ట్, గోరంట్ల, పుట్టపర్తి రూరల్ మండలం, ఓడీసీ, నల్లమాడ, ముదిగుబ్బ, పులివెందల మీదుగా మేదరుమెట్ల వరకు ఆ రోడ్డు వెళ్తుంది. రూ.18 వేల కోట్లతో రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఒక్క పుట్టపర్తి నియోజకవర్గంలోనే రూ.6 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కళ్లు మూసుకుపోయిన చంద్రబాబుకు, టీడీపీ నేతలకు ఇవేవీ కనిపించవు. ఉదయం లేచింది మొదలు వైయస్ఆర్ సీపీపై నిందలు వేయడమే వారి పని. చంద్రబాబు దుర్మార్గపు పాలనలో వెనుకబడిన ప్రాంతాల్లోని 31 రోడ్ల రిపేర్లకు డబ్బులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి జగనన్నను కోరుతున్నాను. పుట్టపర్తి జిల్లా కేంద్రంలో మరింత అభివృద్ధి జరిగేందుకు సీఎం వైయస్ జగన్ ఇచ్చిన తోడ్పాటు మరువలేనిది. మహానేత వైయస్ఆర్ ప్రతిరూపమైన సీఎం వైయస్ జగన్ ప్రజలందరి గుండెల్లో నిలిచారు’ అని ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్రెడ్డి అన్నారు.