అనంతపురం: స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ తన పదవిని అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి లాభం చేకూర్చేందుకు పనిచేస్తున్నాడని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. వ్యవస్థల్లో జొప్పించిన తన మనుషులను అడ్డం పెట్టుకొని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలంతా ముఖ్యమంత్రి వైయస్ జగన్ వెంటే ఉన్నారన్నారు. వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎప్పుడూ, ఎక్కడా చేయని విధంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయననారు. తప్పకుండా అన్ని పంచాయతీల్లో వైయస్ఆర్ సీపీ బలపర్చిన అభ్యర్థులే విజయం సాధిస్తారన్నారు. ఏకగ్రీవ ఎన్నికలు అడ్డుకోవడం వెనక ఉన్న ఆంతర్యమేంటీ..? అని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ను ప్రశ్నించారు. నిమ్మగడ్డ నిర్ణయాలన్నీ వివాదాస్పదాలేనని, తాను చెప్పిందే వేదం అన్నట్లుగా నిమ్మగడ్డ నడుచుకోవడం దారుణమన్నారు. ఏకగ్రీవాలను పెండింగ్లో పెట్టడం ఏంటీ..? అని నిలదీశారు. నిమ్మగడ్డకు ఏమైనా కంప్లయింట్ వచ్చాయా..? ఫిర్యాదులు వస్తే రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని, దానికి ఎస్ఈసీకి ఏమి సంబంధం అని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో ప్రకటించిన తెలుగుదేశం పార్టీపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా.. విత్డ్రా చేసుకోమనడం వెనక కారణం ఏంటో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటికైనా నిమ్మగడ్డ రమేష్కుమార్ తన పద్ధతి మార్చుకొని, ఎన్నికలు నిస్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు.