టీడీపీది ఆవిర్భావం కాదు.. అంతర్ధాన దినోత్సవం

తెలుగుదేశం పార్టీలో చేరిన విష సర్పం చంద్రబాబు

ఎన్టీఆర్‌ వారసులకు పౌరుషం ఉంటే టీడీపీకి ఈ గతి పట్టేది కాదు

టీడీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో 132.31 శాతం అప్పులు

రాబోయే రోజుల్లో టీడీపీ ఆఫీసుల్లో హెరిటేజ్‌ మాల్స్‌ పెట్టుకోవాల్సిందే..

ప్రత్యేక హోదా అనే పదాన్ని ఉచ్ఛరించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు

వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాదు.. అంతర్ధాన దినోత్సవంలా కనిపించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. సూర్యోదయాన చేసుకోవాల్సిన ఆవిర్భావ దినోత్సవాన్ని..  సూర్యాస్తమ సమయంలో జరుపుకున్నారని, టీడీపీకి పుట్టగతులు లేవని నిన్న జరిగిన సంఘటన చూస్తే అర్థం అవుతుందన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు చంద్రబాబు ఎక్కడున్నాడని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చంద్రబాబు... టీడీపీలోకి ఎలా, ఎప్పుడు, ఏదోవలో ప్రవేశించాడో రాష్ట్రంలోని యువత తెలుసుకోవాలన్నారు. ఎన్టీఆర్‌ స్థాపించిన టీడీపీకిలోకి ప్రవేశించి విష సర్పం చంద్రబాబు అని ఎమ్మెల్యే అంబటి ధ్వజమెత్తారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘1982 మార్చి 29వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత గౌరవం పొందిన మహానటుడు నందమూరి తారక రామారావు ప్రారంభించిన ఒక రాజకీయ పార్టీ అనూహ్యంగా తొమ్మిది మాసాల్లోనే ఒక రాజకీయ శక్తిగా ఎదిగి తిరుగులేని పాలన చేసింది. ఆ పార్టీ ఎన్టీఆర్‌ ప్రారంభిస్తే.. చీములు పెట్టిన పుట్టలో పాములు ప్రవేశించినట్టుగా ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రవేశించి చీమలను చంపేసి.. విష సర్పంలా పార్టీని ఆక్రమించుకున్నాడు. 

టీడీపీ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబు మాటలు హాస్యాస్పదంగా అనిపించింది. టీడీపీ బతికిబట్టకట్టే పార్టీ కాదు. మళ్లీ తిరిగి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకని పరిస్థితికి నెట్టబడింది. సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీలకు కూడా అభ్యర్థులు లేరు.. అలాంటి పార్టీల్లా టీడీపీ తయారవుతుంది. 

ఎన్టీఆర్‌ వారసులకు పౌరుషం ఉంటే టీడీపీకి ఇలాంటి గతి పట్టేది కాదు. కుయుక్తులు, దుర్మార్గాలతో రాజకీయం చేసే వ్యక్తి, మ్యానిప్‌లేటర్‌ అయినటువంటి వ్యక్తి చేతిలోకి టీడీపీ వెళ్లినందున ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. ఎన్టీఆర్‌ కుమారులకు పౌరుషం ఉంటే.. చంద్రబాబు ఈ రకంగా పార్టీని నాశనం చేసే పరిస్థితికి రాకుండా కాపాడేవారు. లోకేష్‌ను సీఎంను చేయాలనే అత్యాశతో.. రాజకీయ పార్టీలోకి లోకేష్‌ను ప్రవేశింపజేశాడు. ఎమ్మెల్సీ, మంత్రిని చేస్తే మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయాడు. 

ఆదాయానికి మించిన అప్పులు చేస్తున్నారంట.. ప్రజలారా మీరే కాపాడుకోండి.. ఎవరిచ్చారీ అధికారం అని చంద్రబాబు పదే పదే అంటున్నాడు. వైయస్‌ఆర్‌ సీపీకి ప్రజలే అధికారాన్ని ఇచ్చారు. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. 11 నెలల్లో రూ.79,191 కోట్ల రుణం అని ఎల్లో పత్రిక రాయగానే దాన్ని భుజాన పెట్టుకొని ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. 

చంద్రబాబు పరిపాలన చేసినప్పుడు ఏరకమైన అప్పులు చేశారో ఎల్లోమీడియా చెప్పాలి. 2014 నుంచి 2019 వరకు కేంద్ర ప్రభుత్వం అప్పుశాతం 49.92 శాతం పెరిగితే.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో 132.31 శాతం అప్పులు చేసిన ఘనత చంద్రబాబుది. అప్పుడు ఎల్లో మీడియాకు కనిపించదా..? 

ప్రస్తుతం రాష్ట్రమే కాదు దేశం మొత్తం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సంక్షేమ పథకాలు ఆగకూడదనే ఉద్దేశంతో కరోనా సమయంలో ఆర్థిక సంక్షోభం వచ్చినప్పటికీ ప్రజలకు మేలు చేయాలనే ధృడ సంకల్పంతో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రతి పైసాకు జవాబుదారీతనంగా నిలబడింది. ఇదంతా ప్రజలు గమనించారు కాబట్టే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. 

ప్రత్యేక హోదా అనే పదాన్ని ఉచ్ఛరించే నైతిక హక్కు కూడా చంద్రబాబుకు లేదు. కేంద్రంతో ఐదేళ్లు పనిచేసిన చంద్రబాబు.. ప్రత్యేక హోదా ఈ రాష్ట్రాన్ని బతికిస్తుందా...? ప్రత్యేక ప్యాకేజీ బ్రహ్మాండం అని సుదీర్ఘ ఉపన్యాసాలు చేసి హోదాను నిట్టనిలువునా ముంచిన మోసగాడివి నువ్వు కాదా చంద్రబాబూ..? ప్రత్యేక హోదానే ఈ రాష్ట్రానికి సంజీవని అని మేము నమ్ముతున్నాం.. దాని కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. ప్యాకేజీ స్వీకరించి రాష్ట్రాన్ని మోసం చేసిన చంద్రబాబుకు హోదా గురించి మాట్లాడే అర్హతే లేదు. 

ఈ రాష్ట్రంలో చంద్రబాబు తిరిగి అధికారంలోకి వచ్చేది కల మాత్రమే. అయినా మీ కార్యకర్తలను మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షమట.. అలా చంద్రబాబు వెలుగొందాడు. వైయస్‌ఆర్‌ వచ్చిన తరువాత చంద్రబాబు మూలన కూర్చున్నాడు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడం కల మాత్రమే. ఒక సమర్థవంతమైన నాయకుడు, ప్రజా నాయకుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. తమ్ముళ్లూ బాబు మాటలు నమ్మకండి.. చంద్రబాబు వచ్చి ఏదో చేస్తాడని ఎదురుచూసి మోసపోకండి.. మీ మార్గాలు మీరు వెత్తుక్కోండి. టీడీపీ ఆఫీస్‌లో హెరిటేజ్‌ మాల్స్‌ పెట్టుకోవాల్సిందే తప్ప.. దాంట్లో పనేముండదు’ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. 

 

Back to Top