అసాధారణ పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌లు మామూలే

ఎస్‌ఈసీ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించాం

ఇది రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయం

టీడీపీ దీనిపై అనవసరంగా గగ్గోలు పెడుతోంది

ఎన్నికల సంఘాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది

గతంలో ఈసీలో ఒక్కరే సభ్యులుగా ఉండేవారు

 విధానపరమైన నిర్ణయంలో టీడీపీ నేతలకు ఉన్న అభ్యంతరం ఏంటో?. 

గవర్నరే ఎస్‌ఈసీని నియమిస్తారు..ఇప్పుడు కొత్త విధానానికి గవర్నరే ఆమోదం తెలిపారు

ఇలాంటి సంస్కరణలు అందరూ ఆహ్వానించాలి

వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

తాడేపల్లి: అసాధారణ పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌లు తీసుకురావడం మామూలేనని, ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు కుదించామని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. పదవీ కాలం కుదించడం వల్ల ఇప్పుడుఉన్న వారు పోతారు..కొత్త వాళ్లు వస్తారన్నారు. వ్యక్తులను టార్గెట్‌ చేసి ఈ నిర్ణయాలు తీసుకోలేదన్నారు. ఎస్‌ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే ప్రజాస్వామ్యం కూలిపోతుందన్నారు. ఎన్నికల సంస్కరణలతో పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  వ్యవస్థ బాగుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. రమేష్‌కుమార్‌ను పదవిలో ఉంచేందుకు ఎందుకంత తాపత్రయపడుతున్నారని ప్రశ్నించారు.  శుక్రవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 
 
గవర్నర్‌ ఆమోదం మేరకు ఆర్డినెన్స్‌ జారీ చేయడం జరిగింది. ఈ విధాన పరమైన నిర్ణయంపై టీడీపీ, ఆ పార్టీకి సన్నిహితంగా ఉన్న రాజకీయ పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి. ఇదీ రాజ్యాంగ విరుద్ధమని మాట్లాడుతున్నారు. చంద్రబాబు అయితే ఇది అప్రజాస్వామికమని, గవర్నర్‌కు మొయిల్‌లో లేఖ కూడా పంపించారు. ఇది చెల్లుబాటు కాదని చంద్రబాబు ఆయన సామ్రాజ్యం కూలిపోయినట్లు మాట్లాడుతున్నారు. ఇది ఒక విధానపరమైన నిర్ణయం. ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వాలు అనేకం తీసుకుంటాయి. ఎన్నికల కమిషన్‌ అన్నది ఎన్నికల సమయంలో చాలా కీలకంగా పని చేస్తుంది. నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ఎన్నికల కమిషన్‌ అవసరం. దీనికి సంబంధించి న్యాయస్థానాలు అనేక తీర్పులు ఇచ్చాయి. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.

కేంద్రంలో సెంట్రల్‌ ఎన్నికల కమిషన్, రాష్ట్రంలో స్టేట్‌ ఎన్నికల కమిషన్‌ ఉంటాయి. ఇవి చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి.  ఒకప్పుడు సెంట్రల్‌ ఎన్నికల కమిషన్‌లో ఏక సభ్యులు ఉండేవారు. ఒక్కరే ఉంటే ఇబ్బందులు ఉంటాయని, ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం త్రి సభ్య కమిటీలుగా మార్చింది. దీన్ని అందరూ హర్షించారు. అనేక సందర్భాల్లో అనేక సంస్కరణలు ప్రభుత్వాలు తీసుకువచ్చాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా విధానపరమైన నిర్ణయం తీసుకుంది. గతంలో ఐదేళ్ల పాటు కమిషనర్, సభ్యులు ఉండేవారు. దాన్ని మూడేళ్లకు కుదించాం. ఈ నిర్ణయం తీసుకుంటే టీడీపీ ఎందుకు గగ్గోలు పెడుతుందో అర్థం కావడం లేదు. మూడేళ్లకు కుదించిన నిర్ణయంపై టీడీపీకి ఏమైన అభ్యంతరాలు ఉన్నాయా?. టీడీపీది సరైన విధానం కాదు. వ్యక్తులను టార్గెట్‌ చేసి ఈ విధానపరమైన నిర్ణయం తీసుకోలేదు. చక్కని ప్రజాస్వామ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. నూతనమైన సంస్కరణ తీసుకువస్తే దాన్ని హర్షించకుండా టీడీపీ నేతలు మాట్లాడటం సరికాదు. ఆర్డినెన్స్‌ ఎందుకు తీసుకువచ్చారు. చట్టం చేయవచ్చు కదా అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో బడ్జెట్‌ కూడా ఆమోదం తెలపలేని దుస్థితి ఉంది. బడ్జెట్‌ను కూడా ఆర్డినెన్స్‌ ద్వారానే ఆమోదించి ప్రభుత్వాన్ని నడుపుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. గవర్నర్‌ ఆమోదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. తరువాత దాన్ని చట్టరూపం చేస్తాం. దీనికి గందరగోళం చేయడం సరికాదు. రాజ్యాంగంలోని 243 కే ప్రకారం పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు అవకాశాలు ఉన్నాయి. పంచాయతీ రాజ్‌ వ్యవస్థకు ఎన్నికలు నిర్వహించేందుకు స్టేట్‌ ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్‌ నియమిస్తారు.

గవర్నరే ఎన్నికల కమిషనర్‌ను నియమించారు. ఆయనే ఇవాళ ఐదేళ్ల పదవి కాలాన్ని మూడేళ్లకు కుదించారు. ప్రస్తుతం కొత్తవారు వస్తారు. దీనికి గందరగోళపడాల్సిన అవసరం లేదు. పటిష్టమైన ఎన్నికల కమిషన్‌ ఏర్పాడలనే ఉద్దేశంతోనే ఇవాళ సంస్కరణలు చేశాం. ఇది రాజ్యాంగ బద్దమైన నిర్ణయమే తప్ప వేరేలా భావించవద్దు. బురదజల్లే కార్యక్రమాలు ప్రతిపక్షాలకు తగదు. చట్టప్రకారం తీసుకున్న నిర్ణయాలను తప్పుపట్టడం చంద్రబాబుకు తగదు. ఇది ఒక మంచి సంస్కరణ..దీన్ని అందరూ ఆహ్వానించాలని అంబటి రాంబాబు కోరారు.
 

Back to Top