శిరోముండనం ఘ‌ట‌న‌పై ఎమ్మెల్యే అదీప్‌రాజ్ విచారం

విశాఖ‌: విశాఖ నగర శివారులో బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, జనసేన నాయకుడు నూతన్ నాయుడు ఇంట్లో ద‌ళిత యువ‌కుడికి శిరోముండ‌నం చేసిన ఘ‌ట‌న‌పై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అదీప్‌రాజ్ విచారం వ్య‌క్తం చేశారు.   చెప్పకుండా పని మానేశాడన్న కోపంతో కర్రి శ్రీకాంత్‌ అనే యువకుడిపై నూత‌న్ నాయుడు ఈ దారుణానికి పాల్పడ్డారు. విష‌యం తెలిసిన వెంట‌నే అదీప్‌రాజ్ విశాఖ‌ ఏసీపీ, సీఐతో మాట్లాడారు.  ఈ ఘ‌ట‌న‌ల‌పై ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంద‌ని, బాధ్యులు ఎంత‌టివారైనా ఉపేక్షించేది లేద‌ని హెచ్చ‌రించారు. కులాల‌కు అతీతంగా నిందితుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పేర్కొన్నారు. వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం ద‌ళిత ప‌క్ష‌పాతి అన్నారు. నిందితులకు శిక్ష ప‌డ‌టం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు. బాధిత యువ‌కుడికి ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని అదీప్‌రాజ్ పేర్కొన్నారు. కాగా, దళిత యువకుడి శిరోముండనం కేసులో నూతన్‌ కుమార్‌ నాయుడు భార్య మధుప్రియతో సహా ఏడుగురిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. మధుప్రియ సూచన మేరకే ఈ శిరోముండనం జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నూతన్‌ నాయుడు భార్యతో పాటు మిగతావారిని పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ విభాగం ఏసీపీ త్రినాథ్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేపట్టాయి.   

Back to Top