విశాఖ: ఎన్నికల సమయంలో ప్రజలకు మాట ఇచ్చి..అధికారంలోకి వచ్చిన తరువాత మోసం చేయడం చంద్రబాబు నైజమని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ సహా భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఒక్క అబద్దం చెప్పడానికి కూడా వైయస్ జగన్ ఒప్పుకోలేదు. అధికారంలోకి వచ్చిన చంద్రబాబును హామీల అమలు కోసం అడిగితే మొన్నే అధికారంలోకి వచ్చాం అంటున్నారు. మరి మొన్నే అధికారంలోకి వచ్చిన మీరు గ్రీన్ హైడ్రో ప్రాజెక్టు ఎలా తీసుకొచ్చారు?. బల్క్ డ్రగ్ పార్క్ ఎలా తీసుకొచ్చారు?. పథకాల విషయంలో మొన్నే అధికారంలోకి వచ్చాం అంటారా?. ప్రాజెక్టులు మాత్రం మేమే తీసుకొచ్చాం అంటారా?. ఇదెక్కడి న్యాయం’ అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు ఓటమి నుంచే పట్టుదల: మాజీ మంత్రి అంబటి రాంబాబు ‘ఓటమి నుంచే పట్టుదల పెరుగుతుంది. ఎనిమిది నెలల కాలంలో ఇంత వ్యతిరేకత మూటకట్టుకున్న ప్రభుత్వం లేదు. చంద్రబాబు సూపర్ సిక్స్కు పవన్ కళ్యాణ్ గ్యారంటీ ఇచ్చారు. బీజేపీ గ్యారంటీ ఇవ్వలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటానంటే ఆయన భార్య, కొడుకు ఒప్పుకునేలా లేరు. వైయస్ఆర్సీపీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలవడానికి లోకేష్ ఒక్కడు చాలు. లోకేష్కు దండం పెట్టిన వాడికి మంత్రి పదవి ఇచ్చారు. ఉభయ రాష్ట్రాలలో మంచి పేరున్న నాయకుడు బొత్స సత్యనారాయణ. పార్టీ ఓడినా మండలి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్న వ్యక్తి బొత్స. 164 స్థానాలు ఎందుకు వచ్చాయో కూటమి నేతలకే అర్ధం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ పునఃనిర్మాణం జరుగుతుంది. ధర్మశ్రీని ఢిల్లీ పంపాలని వైయస్ జగన్ నిర్ణయించారు’ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ చేశారు. 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ‘2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ కావాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి చేసిన సీఎంగా వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్రంలో పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత వైయస్ జగన్కే దక్కుతుంది. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత వైయస్ జగన్ది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కూడా వైయస్ఆర్సీపీ హయాంలోనే వచ్చింది. వైయస్ జగన్కు ధన్యవాదాలు: కరణం ధర్మశ్రీ ‘నాకు అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులుగా అవకాశం ఇచ్చిన వైయస్ జగన్కు ధన్యవాదాలు. అనకాపల్లిలో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడంలో నా పాత్ర కీలకంగా ఉంటుందని నూకాంభిక అమ్మవారిపై ప్రమాణం చేస్తున్నాను.ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఈ ప్రాంతంలో వైయస్ఆర్సీపీ లక్కు.. అంబటి రాంబాబు అంటే వైయస్ఆర్సీపీలో కిక్కు. చంద్రబాబు మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేశాడు. ఎనిమిది నెలల్లోనే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేనని బాబు చేతులెత్తేశాడు. మోసం చేసిన టీడీపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి’ అని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మ శ్రీ పిలుపునిచ్చారు.