కడప : ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ నేతలు వైయస్ఆర్ కడప జిల్లా ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. వైయస్ఆర్సీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపిస్తూ వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యేలు దాసరి సుధా, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, వైయస్ఆర్సీపీ నాయకులను నోటికొచ్చినట్లు మాట్లాడిన రాధాకృష్ణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు కనీసం స్పందించకపోవడం విచారకరమని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని, వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్న చిన్న సోషల్ మీడియా పోస్టులకే కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వం, ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తోందని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానమేనని, మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఉపేక్షించరాదని వైయస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.