వైయ‌స్ఆర్‌సీపీ జెండా..బీసీల‌కు అండ‌

 వైయ‌స్ఆర్‌సీపీ నేత శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి 

బీసీ గ‌ర్జ‌న పోస్ట‌ర్ విడుద‌ల 

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ..బీసీల‌కు అండ‌గా ఉంటుంద‌ని శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి అన్నారు. ఈ నెల 17న త‌ల‌పెట్టిన బీసీ గ‌ర్జ‌న పోస్ట‌ర్‌ను ఆయ‌న విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా చ‌క్ర‌పాణిరెడ్డి మాట్లాడుతూ.. నలభై సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, అదే నలభై సంవత్సరాల వయస్సున్న వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పథకాలను కాపీ కొడుతున్నాడన్నారు. ఈ కాపీరాయుడిని సమాజం నుంచి డిబార్‌ చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బాబును నమ్మితే నట్టేట మునగాల్సిందేనని, 600 హామీలతో గద్దెనెక్కిన ఆయన ఏ ఒక్కటీ నెరవేర్చకుండా ఇప్పుడు తిరిగి ఎన్నికల వేళ కొత్త హామీలు ఇస్తున్నాడన్నారు. కాపులను మభ్యపెడుతూ సీఎం పబ్బం గడుపుకుంటున్నాడని, ఆయనకు చిత్తశుద్ధి ఉంటే  ఎందుకు బీసీలుగా గుర్తించలేదని ప్రశ్నించారు.

ఆర్థికంగా వెనుకబడిన వారికి కేంద్రం ఈబీసీ రిజర్వేషన్‌ కల్పిస్తే.. అందులో కాపులకు 5శాతం కోటా ఇస్తామంటూ కొత్త డ్రామాకు చంద్రబాబు తెరలేపారని విమర్శించారు. ఆర్థికంగా వెనుకబడిన వారు ఇందులోకి వస్తారని, కొత్తగా ఆయన చేసిందేమీ లేదన్నారు. కేవలం కల్లబొల్లి మాటలతో ప్రజలందరినీ మభ్యపెడుతున్నాడు తప్ప, ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన బాబుకు ఏ కోశానా లేదన్నారు. కాపు కార్పొరేషన్‌ రుణాలు కూడా పక్కదారి పట్టిస్తున్నారని, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తప్ప అర్హులకు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే కాపు సంక్షేమానికి ప్రతి ఏడాది రూ.2 వేల కోట్లు చొప్పున 5ఏళ్లలో రూ.10 వేలు కోట్లు కేటాయిస్తామన్నారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన వారందరికీ రుణాలు విరివిగా ఇస్తామన్నారు.   

Back to Top