తాడేపల్లి: శాసనసభ స్పీకర్గా పార్టీలకతీతంగా హుందాగా వ్యవహరించాల్సిన అయ్యన్న పాత్రుడు బుధవారం నాటి సభలో వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు సరికాదని వైయస్ఆర్సీపీ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మండిపడ్డారు. వైయస్ జగన్నుద్దేశించి స్పీకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.``అయ్యన్నపాత్రుడి ఇవాళ సభలో చాలా పరుషంగా మాట్లాడారు. బెదిరింపు, వ్యంగం, వెటకారపు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం" అని వైయస్ఆర్సీపీ హయంలో డిప్యూటీ స్పీకర్గా పని చేసిన సీనియర్ నేత కోన రఘుపతి స్పష్టం చేశారు. "మీకున్న 23 మందిలో ఐదారుగురిని లాగేస్తే.. అని వైయస్ జగన్ గతంలో అన్న మాటలను చీటికీమాటికీ స్పీకర్ సహా చాలామంది టీడీపీ నేతలు తెరపైకి తెస్తుంటారు. వాస్తవానికి నాడు వైయస్ జగన్ అన్న ఉద్దేశం వేరు. 2014-19 మధ్య సీఎంగా ఉన్న చంద్రబాబు నాడు ప్రతిపక్షంలో ఉన్న వైయస్ఆర్సీపీకి చెందిన 23 మంది సభ్యులను లాగేసుకుని.. అందులో కొందరికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు.. ఆ దుష్ట రాజకీయాన్ని బాబుకు గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే నాడు సీఎంగా వైయస్ జగన్ ఆ మాటలు అన్నారే గానీ.. ఇప్పటిలా కక్ష సాధింపు రాజకీయాల మాదిరి కాదు" అని కోన రఘుపతి అన్నారు. నాడు వైయస్ జగన్ అన్న ఆ మాటను పొలిటికల్ స్టేట్మెంట్గా చూడాలని ఆయన కోరారు.