ప్రజల ఉసురు తాకే ప్రతిపక్షంలో కూర్చున్నావ్‌

సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి ఓర్వలేకే టీడీపీ విషప్రచారం
వైయస్‌ఆర్‌ సీపీ నేత దేవినేని అవినాష్‌

విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు చూసి ఓర్వలేక చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తోందని వైయస్‌ఆర్‌ సీపీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్‌ అన్నారు. విజయవాడలో పెన్షన్‌దారులందరితో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలెవరూ నమ్మొద్దన్నారు. అర్హులకు పెన్షన్‌ తొలగించారని చంద్రబాబు విషప్రచారాన్ని ఖండిస్తూ.. ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారానికి నిరసనగా ర్యాలీ చేపట్టామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజల ఉసురు తాకుతుందని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని, అమ్మ ఒడి పథకం అందిస్తున్నందుకు ఉసురు తాకుతుందా..? లేక విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నందుకు ఉసురు తాకుతుందా..? లేదా.. వలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇంటింటికీ అందించినందుకు ఉసురు తాకుతుందా..? చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిది నెలల పాలనలోనే అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఎందుకు ఉసురు తాకుతుందని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి ఐదేళ్ల పాటు ప్రజలను మోసం చేసిన చంద్రబాబు, ఆయన పార్టీకి ఉసురు తాకి ప్రతిపక్షంలో కూర్చున్నాడన్నారు. 

చంద్రబాబుకు, టీడీపీకి పనిపాట లేక ప్రభుత్వంపై లేనిపోని అసత్య ప్రచారాలు చేస్తున్నారని దేవినేని అవినాష్‌ మండిపడ్డారు. ప్రజల దృష్టి మళ్లించేందుకు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేయిస్తున్న ఈ విషప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రేపు ఉగాది నాటికి అర్హులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. తెల్లవారక ముందే ఇంటికి వచ్చి పెన్షన్లు పంపించిన సీఎం వైయస్‌ జగన్‌ను ప్రతి ఒక్క పెన్షన్‌దారు మా పెద్ద కొడుకు జగన్‌ అని అంటున్నారని, ఆ ప్రజానీకం ఆశీర్వాదం సీఎం వైయస్‌ జగన్‌కు ఉందన్నారు.  
 

Back to Top