చంద్రబాబుది ప్రజాస్వామ్యానికి పనికిరాని పాత్ర

బాబు చెరలో కుప్పం దశాబ్దాలుగా మగ్గిపోతుంది

టీడీపీ ఏజెంట్లుగా రౌడీషీటర్లను ఎందుకు కూర్చోబెట్టారు..?

దొంగ ఓట్లు, రిగ్గింగ్‌ చేయించే కల్చర్‌ చంద్రబాబుకే సొంతం

దిగజారుడు రాజకీయాలకు వైయస్‌ఆర్‌ సీపీ దూరం

సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పథకాల స్వచ్ఛమైన గాలులు కుప్పం చేరాయి

అందుకే పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వీప్‌ చేశాం

కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో అదే రిజల్ట్‌ రిపీట్‌ అవుతుంది

వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: దశాబ్దాలుగా చంద్రబాబు చెరలో మగ్గిపోతున్న  కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పాలనలో విముక్తి లభిస్తోందని, ప్రభుత్వ çసంక్షేమ పథకాల ఫలితమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు వైయస్‌ఆర్‌ సీపీ స్వీప్‌ చేసిందని, కుప్పం నగర పంచాయతీ ఎన్నికల్లోనూ అదే ఫలితం ప్రతిబింబించబోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కుప్పంలో 8 వేల దొంగ ఓట్లు ఉన్నాయని ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని, దొంగ ఓట్లు ఏరివేసినప్పుడల్లా చంద్రబాబు మెజార్టీ తగ్గుతూ వస్తుందన్నారు. దొంగ ఓట్లు వేయించే కల్చర్, రిగ్గింగ్‌ చేయించి కల్చర్‌ చంద్రబాబుకే ఉందన్నారు. చంద్రబాబు కోట ఎందుకు బద్ధలైందో అందరికీ తెలుసన్నారు. చీకటిని విడిచి వెలుతురులోకి వెళ్లినట్టు.. సీఎం వైయస్‌ జగన్‌ వచ్చాక.. రాష్ట్రం మొత్తం సంక్షేమ ఫలాల రుచిని చూస్తోందని, ఆ మంచి గాలులు కుప్పం చేరాయని, వాటి ప్రతిస్పందనగా జనం కూడా స్పందిస్తున్నారన్నారు. 

ప్రజాస్వామ్యానికి పనికిరాని క్యారెక్టర్‌ అని చూపడానికి చంద్రబాబు క్యారెక్టర్‌ పనికొస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రౌడీషీట్లు ఉన్నవారిని పోలింగ్‌ ఏజెంట్లుగా ఎందుకు కూర్చోబెట్టారని ప్రశ్నించారు. కుప్పం ఓటమిని గ్రహించిన చంద్రబాబు సాకులు వెతుక్కుంటున్నారని, పోలింగ్‌ కేంద్రాల వద్దకు టీడీపీ నేతలను గుంపులుగా పంపించి దౌర్జన్యాలు చేయిస్తున్నాడని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. 

సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే..

మొత్తం 12 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలే అసలైన గీటురాయి. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లయింది. స్థానిక సంస్థలు, పంచాయతీ, మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి అజెండాగా ప్రజల్లోకి వెళ్లాం. ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలనను ఆశీర్వదించారు. ప్రత్యర్థులంతా తెలుగుదేశం పార్టీ,  జనసేన, బీజేపీ ముసుగులో దూరి.. లోపాయకారి ఒప్పందాలతో ఒకే అభ్యర్థిని సపోర్టు చేసినా.. బద్వేలు ఉప ఎన్నికలో 2019 ఎన్నికల కంటే దాదాపు 15 నుంచి 25 శాతం ఓట్లు పెరిగాయి. 

చంద్రబాబు చెరలో దశాబ్దాలుగా కుప్పం మగ్గిందని వైయస్‌ఆర్‌ సీపీ భావిస్తుంది. చంద్రబాబు కోట బద్దలవుతుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలితమే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌లు వైయస్‌ఆర్‌ సీపీ స్వీప్‌ చేసింది. అదే ఫలితం కుప్పం మున్సిపల్‌లోనూ ప్రతిబింబిస్తుంది. ప్రజల తీర్పును గౌరవంగా స్వీకరించే తత్వం ఉన్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. దిగజారుడు రాజకీయాలకు వైయస్‌ఆర్‌ సీపీ దూరంగా ఉంటుంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసినా.. డబ్బులు పంచినా.. వారిని అనర్హులు చేసే చట్టం తీసుకువచ్చారు. ప్రజల మీద నమ్మకం, విశ్వాసం, ప్రేమ ఉన్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌. 

37 వేల ఓట్లు ఉన్న 24 వార్డుల కుప్పం నగర పంచాయతీ ఎన్నిక. ప్రతి వార్డుకు రెండు పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి బూత్‌లో టీడీపీ ఏజెంట్, అభ్యర్థి, వైయస్‌ఆర్‌ సీపీ ఏజెంట్, అభ్యర్థి కూర్చున్నారు. 48పోలింగ్‌ కేంద్రాల్లో సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా 38ని ఈసీ గుర్తించింది. అక్కడ ఎక్స్‌ట్రా సెక్యూరిటీ ఉంటుంది. దశాబ్దాలుగా చంద్రబాబు చెరలో ఉన్న పట్టణంలో బాబు తయారు చేసిన గ్యాంగ్‌ ఒక ముఠాలా ఏజెంట్లుగా కూర్చొని ఉంటారు కదా.. అంత చిన్న టౌన్‌లో దొంగ ఓటర్‌ ఎవరో తెలియదా..? 

మధ్యాహ్నం 1 గంటకు 60 శాతం ఓట్లు పోలయ్యాయి. అధికారంలో ఉన్న పార్టీ నిజంగా ఏదైనా చేయాలనుకుంటే అంత శాతం ఓట్లు పోలవుతాయా..? పోలింగ్‌ కేంద్రాల వద్ద టీడీపీ నేతలు ఎందుకు గుంపులుగా చేరాల్సి వచ్చింది. ఓటర్లకు డబ్బులు పంచుతూ తెలుగుదేశం పార్టీ నేతలు అడ్డంగా దొరికారు. ప్రలోభాలకు తెరతీసింది చంద్రబాబే. బయటి ప్రాంతాల నుంచి టీడీపీ కార్యకర్తలను కుప్పానికి ఎందుకు తీసుకువచ్చారు..? 37 వేల మంది ఓటర్లలో మీ ఓటర్లు మెజార్టీగా ఉంటే వారు వెళ్లి ఓటు వేసి రావొచ్చు కదా..! దశాబ్దాలుగా చంద్రబాబు చెరలో ఉన్న కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలకు బయటివ్యక్తులు ఎవరో కూడా తెలియదా..? పచ్చ ఛానళ్లలో కూడా చంద్రబాబు బయట నుంచి తోలిన టీడీపీ గుంపులనే చూపిస్తున్నారు. 

కుప్పంలో నానా యాగీ చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఆఖరికి పరువు పోతుందని ప్రెస్‌మీట్‌ పెట్టి బాబు మాట్లాడిన మాటలు చూస్తే చంద్రబాబు ఈ జన్మకు మారడని అర్థం అవుతుంది. మొహం మీద ఉమ్మేసే మాట చంద్రబాబుకే వర్తిస్తుంది. మా ఏజెంట్లందరినీ అరెస్టు చేశారని బాబు మాట్లాడుతున్నాడు. గాజులు గోపి, వెంకటేష్, రాజ్‌కుమార్‌ ఇలా రౌడీషీట్‌లు ఉన్నవారిని కూర్చోబెడితే ఏజెంట్లు కాబట్టి పోలీసులు వదిలేశారు. రౌడీషీట్‌ ఉన్నవారిని ఏజెంట్లుగా ఎలా కూర్చోబెడతారు..? లేనిది ఉన్నట్టు, జరిగినట్టు ప్రచారం చేయడం చంద్రబాబుకు అలవాటు. కుప్పంలో ఘోరాలు జరిగిపోతున్నాయని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓటమికి సాకులు వెతుకుతున్నాడు.

కుప్పంలో టీడీపీ గెలిస్తే చంద్రబాబు ఘనత.. లేదంటే ఈవీఎంల తప్పు అని కప్పిపుచ్చుకోవడం. ప్రజాస్వామ్యంలో చంద్రబాబు లాంటి క్యారెక్టర్‌.. పనికిరాని క్యారెక్టర్‌ అని చూపడానికి పనికొస్తుంది. మా ప్రభుత్వం పనితీరును ప్రజలు మెచ్చుకుంటున్నారు. మంచిచేసే నేతలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారు. వరుస ఎన్నికల్లో ప్రజల ఇస్తున్న తీర్పే అందుకు నిదర్శనం. 
 

Back to Top